రూపాయి ముట్టను, అక్రమాలకు పాల్పడను : సర్పంచ్ అభ్యర్థి బాండ్ పేపర్..!
హైదరాబాద్ : ఎన్నికల్లో గెలిచే వరకు ఒక తీరుగా ఉండే నేతలు.. కుర్చీ ఎక్కాక రూట్ మార్చుతారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టినదానికి లెక్కలేసి మరి అడ్డగోలుగా కూడబెట్టే ప్రయత్నం చేస్తారు. ఐదేళ్ల పదవీకాలంలో అందినకాడికి దండుకుంటారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కనబెట్టి.. జేబులు నింపుకొనే పనిలో బిజీగా మారిపోతారు. అదలావుంటే ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు వింతగా ఉన్నా.. ఆసక్తికరంగా మారాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీకి చెందిన పెద్దాయన.. ఎమ్మెల్యే అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గెలిపించిన ప్రజలకు సేవ చేస్తానని, ఎలాంటి అక్రమాలకు పాల్పడననేది ఆ ప్రమాణం సారాంశం. అలాగే ఒక చోట స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఒకతను చెప్పుతో పాటు ప్రమాణ పత్రం ఓటర్లకు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఒకవేళ గెలిచాక ప్రజలకు పనులు చేసిపెట్టకపోతే ఆ చెప్పుతో తనను కొట్టాలని, పనితీరు నచ్చకుంటే ఆ ప్రమాణ పత్రాలు అసెంబ్లీకి పంపి తన రాజీనామాకు డిమాండ్ చేయాలనేది ఆయన ఉద్దేశం.
తాజాగా పంచాయతీ తుది పోరు ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కట్టంగూరు మండలం చెర్వు అన్నారం గ్రామపంచాయతీలో జరిగిన వింత ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఓ సర్పంచ్ అభ్యర్థి.. తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ బాండ్ పేపర్లు పంపిణీ చేశారు. తనను గెలిపిస్తే రూపాయి ఆశించబోనని, తన ప్రస్తుత ఆస్తుల కంటే ఎక్కువ సంపాదించినట్లైతే జప్తు చేయించడంటూ రాసిచ్చిన ప్రమాణ పత్రం అది. ఇంటింటికీ తిరుగుతూ అలా ఓట్లు అభ్యర్థించడం ఆసక్తి కలిగించింది.