నాకు షోకాజ్ నోటీసులా.. ఉత్తమ్ బయటకు పోతేనే పార్టీ బాగుపడుతుంది : కోమటిరెడ్డి
నల్గొండ : కాంగ్రెస్ పార్టీ పెద్దల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. తనకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం కాదని.. ఆ పార్టీకి ప్రజలే షోకాజ్ నోటీసులు ఇస్తారని ఎద్దేవా చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆరోపణలు చేయడంతో పాటు.. టీఆర్ఎస్ పార్టీకి బీజేపీయే అల్టర్నేట్ అని వ్యాఖ్యానించడంతో రాజగోపాల్రెడ్డికి టీపీసీసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దానిపై ఆయన స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు.
గురువారం నాడు నల్గొండలో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పెద్దలపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. గ్రూపు రాజకీయాలతో పార్టీని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. తాను నిజాలు వెళ్లగక్కుతుంటే కాంగ్రెస్ పెద్దలకు మింగుడు పడటం లేదన్నారు. మహాకూటమి పేరుతో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని ప్రజాగ్రహానికి గురయ్యారని వ్యాఖ్యానించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడం వల్లే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు క్షమాపణ చెప్పాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు.
కేసీఆర్, జగన్కు కులతోకలు ఎందుకు.. నెట్టింట డైరెక్టర్ తేజ వ్యాఖ్యలు రచ్చ రచ్చ..!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మూలాలు లేకుండా పోయే ఛాన్సుందన్నారు రాజగోపాల్ రెడ్డి. భవిష్యత్తులో ఇక కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న వార్తలపై ఆయన మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ దుస్థితిపై తాను మాట్లాడినందుకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఫోన్ చేస్తున్నారని తెలిపారు. కోమటిరెడ్డి కుటుంబ నేతలు గాంధీ భవన్ నేతలు కాదని.. తాము ప్రజల మనుషులమని చెప్పుకొచ్చారు.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డిపై ధ్వజమెత్తారు రాజగోపాల్ రెడ్డి. సీఎం కేసీఆర్తో ఆయన మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్, మై హోమ్ రామేశ్వరరావులతో ఉత్తమ్ ప్రతి నిత్యం టచ్లో ఉంటున్నారని వ్యాఖ్యానించారు. ఉత్తమ్ ఎప్పుడైతే పార్టీ నుంచి తప్పుకుంటారో.. అప్పుడే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందని జోస్యం చెప్పారు.