హుజుర్నగర్ సభకు మరోసారి వర్షం అడ్డంకి...! సాయంత్రం 4 గంటలకు సభ
హుజుర్నగర్లో నేడు తలపెట్టిన టీఆర్ఎస్ ప్రజా కృతజ్ఞత సభకు మరోసారి వర్షం అడ్డంకిగా మారింది. సభా ప్రాంగణం అంతా బురదమయంగా మారింది. మరోవైపు సభ ప్రాంగణంలో వేసిన కుర్చీలు ఇతర సామాగ్రీ తడిసి ముద్దయ్యాయి. కాగా సాయంత్రం నాలుగు గంటలకు సభ జరగాల్సి ఉంది. దీంతో సీఎం సభకు వెళతారా లేదా రద్దు చేస్తారా అనేది తేలాల్సి ఉంది.
అయితే ఉప ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభకు కూడ వర్షం అడ్డంకిగా మారింది. భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. మరోవైపు వర్షం కారణంగా ముఖ్యమంత్రి బయలుదేరాల్సిన హెలికాప్టర్కు ఏవీయోషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు. ఇలాంటీ వాతవరణంలో హుజుర్నగర్కు వెళ్లడం కష్టంగా ఉంటుందని ఏవియోషన్ అధికారులు సూచించారు. అయితే నేడు కూడ అదే పరిస్థితి నెలకోంది. దీంతో సభ ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది.
కాగా హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక విజయం టీఆర్ఎస్ పార్టీలో మరింత జోష్ పెంచింది. ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయా పరిణామాలు ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మారుతాయని ప్రతిపక్ష పార్టీలు భావించాయి. దీంతో ఆర్టీసీ సమ్మెకు పలు రాజకీయా పార్టీలు సంపూర్ణమద్దతు తెలిపాయి. కారు గట్టెక్కడం కష్టంగా మారుతుందేమోననే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే హుజుర్నగర్ ఎన్నికల ఫలితాలు రాజకీయా పార్టీల ఊహాగానాలకు చెక్ పెట్టాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి.. తన ప్రత్యర్థి అయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డి మీద 43 వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించారు. మరోవైపు ఇతర పార్టీలు కూడ చతికిల పడ్డాయి. ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ హుజుర్నగర్ ప్రజల ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రజా కృతజ్ఞత సభకు శ్రీకారం చుట్టారు.