నల్గొండలో దారుణం.. పిల్లనిచ్చిన మామపై అల్లుడి ఘాతుకం...
నల్గొండలో దారుణం జరిగింది. పిల్లనిచ్చిన మామనే కడతేర్చాడో అల్లుడు. తన కూతురిని కొట్టవద్దని మామ వారించినందుకే... ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. ఇద్దరూ మద్యం సేవించి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ పట్టణానికి చెందిన చింతల గోపి, ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామకి చెందిన వెంకటలక్ష్మిలకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రిత్విక్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ నెల 20వ తేదీన రిత్విక్ పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ వేడుకకు వెంకటలక్ష్మి తండ్రి ఒంటిపులి వెంకటేశ్వర్లు, ఆమె సోదరుడు ప్రకాష్ నందిగామ నుంచి వచ్చారు. ప్రకాష్ అదే రోజు రాత్రి తిరిగి నందిగామకు వెళ్లిపోగా... వెంకటేశ్వర్లు అక్కడే ఉన్నాడు. సాంప్రదాయం ప్రకారం మరుసటిరోజు బిడ్డ,అల్లుడిని ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాడు.
ఆ తర్వాతి రోజు గోపి,వెంకటేశ్వర్లు కలిసి మద్యం సేవించారు. ఈ సందర్భంగా తన కూతురిని ఎందుకు కొడుతున్నావంటూ వెంకటేశ్వర్లు గోపిని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం ఘర్షణకు దారితీసింది. కోపోద్రిక్తుడైన గోపి క్షణికావేశంలో రోకలి బండతో వెంకటేశ్వర్లుపై దాడి చేయబోయాడు.వెంకటలక్ష్మి అడ్డుకోవడంతో... ఆమెను పక్కకు తప్పించి,అక్కడే ఉన్న రోలుతో మామ తలపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
స్థానికులు వెంకటేశ్వర్లును ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న గోపీ కోసం గాలిస్తున్నారు.