బిల్డింగ్ లేదు, ల్యాబ్ లేదు.. హాస్టల్లో కరెంట్ లేదు.. రోడ్డెక్కిన పాలిటెక్నిక్ విద్యార్థినులు
సూర్యాపేట : సాంకేతిక విద్యను ప్రోత్సహించాలనే ప్రభుత్వ సంకల్పం నీరుగారిపోతోంది. కనీస మౌలిక వసతులు లేక కాలేజీలు తూతూ మంత్రంగా నడుస్తున్నాయనే వాదనలున్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కనిపించే నిర్లక్ష్యం మరెక్కడా కనిపించదేమో. తాజాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ మహిళా పాలిటెక్నిక్ విద్యార్థినులు రోడ్డెక్కడం గమనార్హం.
మౌలిక వసతుల కల్పనలో అధికారులు విఫలమయ్యారంటూ విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రద్ధగా చదువుకుందామంటే సరైన ఫెసిలిటీస్ లేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆందోళనకు దిగారు. స్టూడెంట్స్ నిరసనతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.
సమస్యలపై గొంతెత్తిన విద్యార్థినులు.. రాస్తారోకో
విద్యార్థినులు గొంతెత్తారు. మౌలిక వసతులు లేవంటూ నినదించారు. అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డెక్కారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో సమస్యలే దర్శనమిస్తున్నాయి. ఉన్న భవనం కాస్తా మెడికల్ కాలేజీకి అప్పగించడంతో పాలిటెక్నిక్ కాలేజీకి బిల్డింగ్ లేకుండా పోయింది.
కళాశాలకు భవనం లేకుండా పోవడంతో క్లాసుల నిర్వహణ కష్టతరంగా మారిందని విద్యార్థినులు వాపోయారు. అంతేకాదు ల్యాబ్ సౌకర్యం లేకపోవడంతో ఏమి నేర్చుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మౌలిక వసతులు కల్పించాలంటూ జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు.
అంగన్వాడీలో ప్లాస్టిక్ గుడ్లా.. పేరెంట్స్ ఫిర్యాదుతో పరేషాన్.. తీరా ఏమైందంటే..!
హాస్టల్ అధ్వాన్నం.. అరకొర వసతులతో దుర్భరం
హాస్టల్ వసతి కూడా అధ్వాన్నంగా మారిందని మండిపడ్డారు విద్యార్థినులు. నలుగురు ఉండాల్సిన గదిలో 20 మందికి పైగా ఉండాల్సి వస్తోందని వాపోయారు. కరెంట్ సౌకర్యం లేక చీకట్లో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిపరిస్థితుల్లో ఆందోళన చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. దాదాపు మూడు గంటలకు పైగా స్థానిక కోర్టు చౌరస్తాలో నడిరోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
విద్యార్థినుల రాస్తారోకోతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని.. ఇలా రోడ్లపైన ఆందోళన చేయడం సరికాదని సూచించారు. అయినా కూడా వినకపోవడంతో విద్యార్థినులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. అనంతరం జేసీ సంజీవరెడ్డిని కలిసిన విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రం సమర్పించారు.
సమస్యలు పరిష్కరిస్తా.. జేసీ హామీ
విద్యార్థినుల బాధలను సహృదయంతో అర్థం చేసుకున్న జేసీ అందుకనుగుణంగా వారికి హామీ ఇచ్చారు. ఇకపై కాలేజీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటానన్నారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. త్వరలోనే హాస్టల్ ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. విద్యార్థినులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న జేసీ.. ఏ చిన్న సమస్య ఉన్నా కూడా తాను పరిష్కరిస్తానని వారికి భరోసా ఇచ్చారు. మొత్తానికి జేసీ హామీతో విద్యార్థినులు శాంతించారు.