డమ్మీ పిస్టోల్, నకిలీ పోలీస్.. దారి కాచి దోచారు.. చివరకు ఏమైందో తెలుసా?
సూర్యాపేట : పోలీసులమని చెబుతూ బిల్డప్ ఇచ్చారు. డమ్మీ తుపాకులు చేతబట్టి అందినకాడికి దోచుకున్నారు. చివరకు నిజమైన పోలీసుల చేతికి చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నారు. నకిలీ తుపాకులతో అడ్డగోలుగా రెచ్చిపోయిన ఆరుగురు యువకులను ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మానుష్య ప్రదేశాల్లో అడ్డ వేస్తూ.. ఆ దారిన వెళ్లే వారిని ఆటకాయించి డమ్మీ పిస్టోళ్లతో బెదిరించడంలో ఈ ముఠా ఆరితేరింది.
డమ్మీ గన్స్.. దారి దోపిడీలు
డమ్మీ గన్స్ తో హల్ చల్ చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు సూర్యాపేట పోలీసులు. రహదారుల వెంబడి, నిర్మానుష్య ప్రదేశాల్లో వ్యక్తులను బెదిరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. డమ్మీ పిస్టోల్స్ చేతబట్టి పోలీసులమని చెబుతూ అమాయకులను బెదిరించి దోచుకోవడం వీరి పని. సూర్యాపేట మండలంలోని టేకుమట్ల, ఎండ్లపల్లి గ్రామాలకు చెందిన ఆరుగురు యువకులు ముఠాగా ఏర్పడ్డారు. వీరికి మక్కా అనీల్ అనేవాడు నాయకుడు. అతడి ఆధ్వర్యంలో మేకల నవీన్, నామ గోపి, కామళ్ల విక్టర్, ధరావత్ సాయికుమార్, వల్కి గోపి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు.
సప్పుడు లేదు, కాలుష్యం లేదు.. ఇవాళ్టి నుంచే కొత్త ఎలక్ట్రిక్ బస్సులు
వాహనదారులే టార్గెట్..!
ఫిబ్రవరి 28న అర్వపల్లి మండలం తిమ్మాపురం శివారులోని సూర్యదేవాలయం దగ్గర ఈ ముఠా రెచ్చిపోయింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వ్యక్తిని.. పోలీసుల పేరిట నిలువరించారు. బలవంతంగా అతడి నుంచి వెయ్యి రూపాయలు తీసుకున్నారు. ఈనెల ఒకటవ తేదీన సూర్యాపేట మండలం ఇమాంపేట శివారులో కూడా అలాగే వాహనదారులను అడ్డగించారు. వారి నుంచి 2 వేల రూపాయలు బలవంతంగా లాక్కున్నారు.
కొంతకాలంగా ఈ ముఠా రెచ్చిపోతున్నప్పటికీ ఫిర్యాదులు చేసేవారు కరువయ్యారు. అయితే సూర్యాపేట రూరల్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదులు అందాయి. దాంతో నాగారం సీఐ తూల శ్రీనివాస్ నేతృత్వంలో అర్వపల్లి ఎస్సై లోకేశ్ తో పాటు సూర్యాపేట రూరల్ ఎస్సై చల్లా శ్రీనివాస్ రెండు బృందాలుగా ఏర్పడ్డారు. పిల్లలమర్రి, సోలిపేట, ఉండ్రుగొండ, మూసీ ప్రాజెక్ట్ పరిసరాలు, టేకుమట్ల, రామచంద్రాపురం, ఇమాంపేట తదితర ప్రాంతాల్లో నిఘా పెట్టారు.
సైనిక వీరుడు అభినందన్ కథతో సినిమా.. ఆ పాత్రకు జాన్ అబ్రహమేనా?
పోలీసుల చెక్.. ముఠా గుట్టురట్టు
దొరికితే దొంగ, లేదంటే దొర అన్న చందంగా ఇన్నాళ్లు సజావుగా సాగిన ఈ ముఠా ఆటకు చెక్ పెట్టారు పోలీసులు. వాహనాలు తనిఖీలు చేసే క్రమంలో ముఠా సభ్యులు పోలీసుల చేతికి చిక్కారు. అనుమానం వచ్చి విచారించగా అసలు గుట్టు రట్టైంది. నిందితుల నుంచి కొంత నగదు, ద్విచక్రవాహనం, రెండు డమ్మీ పిస్టోల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డమ్మీ తుపాకులను హైదరాబాద్ లో కొనుగోలు చేసినట్లు వివరించాడు ప్రధాన నిందితుడు, ముఠా నాయకుడు మక్కా అనిల్.
మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తుల సెగ?.. తారక మంత్రం ఫలించేనా?