సూర్యాపేట ఎస్పీపై బదిలీ వేటు వేసిన ఈసీ...!
హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్థుతం ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గం ఉన్న సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లపై బదిలీ వేటు వేసింది. అనంతరం ఆయన్ను హెడ్క్వార్టర్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీకి ఎన్నికలకు సంబంధించిన విధులు కేటాయించవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ను సూర్యాపేట జిల్లాకు ఎస్పీగా నియమించింది.
కాగా అంతకుముందు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు ఈసీని కలిశారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు.60 మంది సర్పంచ్లు నామినేషన్లు వేసేందుకు వస్తే సమయం లేదని నిరాకరించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు భూమన్నపై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నందుకే సర్పంచ్లను నామినేషన్లను వేయకుండా అడ్డుకున్నారని, ఈ ఘటనలపై వెంటనే సీనియర్ అధికారులతో దర్యాప్తు జరిపి రిటర్నింగ్ అధికారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈసీని కలిసిన వారిలో బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, వివేక్, వీరేందర్ గౌడ్లు ఉన్నారు.
కాగా జిల్లా ఎస్పీపై వేటు వేయడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో జరుగుతున్న మద్యం, నగదు పంపీణిపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. మంత్రులు, టీఆర్ఎస్ నేతలు అధికారులను బెదిరించి, అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఝప్తి చేశారు.