అద్దె గర్భం పేరిట మహిళలకు వల.. నల్గొండ జిల్లాలో దుమారం..!
సూర్యాపేట : ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్కసారిగా దుమారం రేగింది. అద్దె గర్భం (సరోగసీ) పేరిట ఇతర ప్రాంతాలకు చెందినవారు స్థానిక మహిళలను ట్రాప్ చేస్తున్నారనే విషయం బయటపడటంతో కలకలం రేపింది. ఇక్కడైతే విషయం బయటకు పొక్కుతుందని భావించి.. బాధితులను దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అద్దె గర్భం కోసం వాడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాకు చెందిన ఓ మహిళను సరోగసీ పేరుతో మరో ప్రాంతానికి తీసుకెళ్లిన ఘటన చర్చానీయాంశమైంది.
అద్దె గర్భం పేరిట మహిళలకు వల.. సూర్యాపేట మహిళ ట్రాప్
సూర్యాపేటకు చెందిన ఓ వివాహితను.. విజయవాడకు చెందిన కుమారి మాయమాటలతో నమ్మించింది. అద్దె గర్భం (సరోగసీ) ప్రక్రియకు ఒప్పుకుంటే డబ్బులు ఇస్తామని ట్రాప్ చేసింది. అయితే కుమారికి మధ్యవర్తిగా సూర్యాపేటకు చెందిన వాణి అనే మహిళ సహకరించింది. అలా ఇద్దరూ కలిసి సదరు మహిళను చెన్నై తీసుకెళ్లారు. అక్కడ సరోగసీ చేయించేందుకు సిద్ధమయ్యారు.
సూర్యాపేటకు చెందిన ఓ వ్యక్తితో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సదరు మహిళతో ఏడు సంవత్సరాల కిందట పెళ్లైంది. వీరిద్దరిది ప్రేమ వివాహం.. ముగ్గురు సంతానం కూడా కలిగారు. అయితే మూడు నెలల కిందట భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. వెతికి వెతికి విసిగి వేసారిపోయిన భర్త చివరకు ఈ నెల 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య కనిపించడం లేదంటూ అతడు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు ఫైల్ చేశారు.
సూత్రధారి ఆమె.. పాత్రధారి ఈమె.. జిల్లాలో కలకలం
అయితే ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసిన క్రమంలో అసలు విషయం వెలుగుచూసింది. ఆమె సరోగసీ కోసం విజయవాడకు చెందిన కుమారితో ఒప్పందం చేసుకుని చెన్నై వెళ్లినట్లు గుర్తించారు. ఆ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఇక్కడి పోలీసులు చెన్నైకి వెళ్లి సదరు మహిళను సూర్యాపేటకు తీసుకొచ్చారు. అప్పటి వరకు ఇంకా సరోగసీ ప్రక్రియం ప్రారంభం కాలేదని తెలుస్తోంది. అయితే ఈ విషయం కాస్తా బయటకు రావడంతో జిల్లాలో అలజడి రేగింది. అద్దె గర్భం పేరిట వ్యాపారం చేస్తున్న ముఠా జిల్లాలో సంచరిస్తుందనే విషయం తెలిసి స్థానికులు కంగు తిన్నారు.
చెన్నైకి వెళ్లి బాధితురాలిని తీసుకొచ్చిన పోలీసులు.. కేస్ ఫైల్
ఎట్టకేలకు పోలీసులు రంగంలోకి దిగి సదరు మహిళను సూర్యాపేటకు తీసుకురావడంతో అద్దె గర్భం పేరిట వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. ఆమె చెప్పిన వివరాల మేరకు వాంగ్మూలం రికార్డు చేసి భర్తకు అప్పగించారు. అదలావుంటే ఈ రాకెట్లో సూత్రధారిగా వ్యవహరిస్తున్న విజయవాడకు చెందిన కుమారితో పాటు మధ్యవర్తిగా పనిచేసిన వాణి తనకు మాయ మాటలు చెప్పి చెన్నైకి తీసుకెళ్లారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆమె చెప్పిన మేరకు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.