‘ఎక్కడున్నామో చూపిస్తాం’: హుజూర్నగర్ బరిలో టీడీపీ, పూర్వ వైభవమే టార్గెట్
హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికలో పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన పొలిట్బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఆదివారం అభ్యర్థి.. సోమవారం నామినేషన్
సమావేశం అనంతరం టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివారం తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. సోమవారం తమ అభ్యర్థి నామినేషన్ వేస్తారని తెలిపారు. గతంలో హుజూర్నగర్ ఎన్నికల్లో తాము పోటీ చేయనప్పటికీ తమ పార్టీ కార్యకర్తలు, నాయకుల కోరిక మేరకు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
పూర్వ వైభవమే టార్గెట్..
అంతేగాక, హుజూర్నగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని రావుల చంద్రశేఖర్ వెల్లడించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని పార్టీ వీడిన నాయకులే ప్రచారం చేస్తున్నారని.. కానీ, కార్యకర్తలు టీడీపీ వెంటే ఉన్నారని వ్యాఖ్యానించారు. హుజూర్నగర్ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని రావుల చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తేవడానికే ఈ పోటీ అని తెలిపారు. మొదటి నుంచి కూడా టీడీపీకి నల్గొండ, హుజూర్నగర్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని అన్నారు.
టీడీపీ ఎక్కడుందో సమాధానం చెబుతాం..
ఆడపడచులకు సమాన హక్కు, పేదలకు ఇళ్లు కట్టించింది టీడీపీనేనని రావు చెప్పారు. హైటెక్ సిటీ నిర్మాణం టీడీపీ వల్లనే జరిగిందని అన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ కూడా ఆనాటి టీడీపీ ఆలోచనేనని చెప్పుకొచ్చారు. టీడీపీ అంటేనే అభివృద్ధి చేసే పార్టీ అని అన్నారు. టీడీపీ నాయకులు కాదు కార్యకర్తలే బలమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా ఎన్టీఆర్ భవన్కు వస్తుంటే ప్రజల నుంచి అశేష స్పందన వస్తోందన్నారు. తెలంగాణలో టీడీపీ ఎక్కడుందనే వారికి కార్యకర్తలే సమాధానం చెబుతారని అన్నారు. హుజూర్నగర్ ఉపఎన్నికలో పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారని రావుల చంద్రశేఖర్ తెలిపారు.
అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే..
ఇది ఇలావుంటే, హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తరపున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున ఉత్తమ్ సతీమణి పద్మావతి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. తమ పార్టీ అభ్యర్థిని గెలుపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. ఇక బీజేపీ కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్లు ప్రకటించింది. తమ అభ్యర్థిని గెలుపించుకుని సత్తా చాటుతామని బీజేపీ అంటోంది. అక్టోబర్ 21న ఎన్నికలు జరగనుండగా.. 24న ఫలితాలు వెలువడనున్నాయి.