హుజూర్ నగర్ బరిలో టీడీపీ: ప్రధాన పార్టీల అభ్యర్దులు ఖరారు: పల్లాకు గెలుపు బాధ్యతలు..!
తెలంగాణలోని హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఖరారయ్యారు. ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయటంతో ప్రధాన పార్టీలు అభ్యర్దులను ప్రకటించాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ సీట్లలో పోటీ చేయని టీడీపీ..ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించింది. అదే విధంగా కాంగ్రెస్.. టీఆర్ యస్..బీజేపీ నుండి అభ్యర్ధులు ఖరారు అయ్యారు. కాంగ్రెస్ ..బీజేపీ నుండి మహిళా అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. అధికార టీఆర్ యస్ పార్టీ ఇక్కడ అభ్యర్ధి గెలుపు బాధ్యతలను పార్టీ సీనియర్ నేత పల్లా రాజేశ్వరరెడ్డికి అప్పగిస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నిక పూర్తయ్యే వరకూ నియోజకవర్గంలోనూ ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే కేటీఆర్ అక్కడ ప్రచారం ప్రారంభించారు.
ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఖరారు..
హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సంబందించిన నోటీఫికేషన్ ఇప్పటికే విడుదల అయింది. నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభం కావటంతో ప్రధాన పార్టీలు అభ్యర్ధులను ప్రకటించాయి. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు కు గడువు ఉంది. వచ్చే నెల 21న పోలింగ్.. 24న కౌంటింగ్ జరగనుంది. ఎన్నిక షెడ్యూల్ విడుదల కాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ అభ్యర్ధిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన సిద్దారెడ్డి కే తిరిగి టిక్కెట్ కేటాయించారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. ఈ సీటు గురించి కాంగ్రెస్ లో భిన్న స్వరాలు వచ్చినా..ఉత్తం కుమార్ రెడ్డి మాటకే ప్రాధాన్యత దక్కింది. ఇక..బీజేపీ నుండి శ్రీకళారెడ్డిని తెలంగాణ బీజేపీ నేతలు ఎంపిక చేశారు. ఆమె తండ్రి జితేందర్ రెడ్డి కోదాడ మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. శ్రీకళారెడ్డి భర్త కూడా బీఎస్పీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆమె కుటుంబమంతా రాజకీయ నేపథ్యంకాబట్టి.. ఆ దిశలో కూడా పరిశీలించిన బీజేపీ అధిష్టానం శ్రీకళారెడ్డివైపు మొగ్గుచూపింది. దీంతో ఈ మూడు పార్టీల అభ్యర్ధులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కావటం ప్రత్యేక అంశంగా మారింది.
బరిలో టీడీపీ అభ్యర్ధి..
తెలంగానలో క్రమేణా పట్టు కోల్పోయిన టీడీపీ ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో పోటీ చేయాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. గత ఏడాది జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమితో కలిసి పోటీ చేసిన టీడీపీ రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇప్పుడు అందులో ఒక ఎమ్మెల్యే టీఆర్ యస్ లోకి వెళ్లిపోయారు. ఇక, త్వరలో మున్సిపల్..గ్రేటర్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తిరిగి కేడర్ లో జోష్ నింపాలంటే ఈ ఉప ఎన్నికలో పోటీ చేయాలని భావిస్తోంది. నల్లగొండ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఇక్కడి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో పార్టీ వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వకుండా.. టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగాలని నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హుజూర్నగర్లో టీడీపీకి మంచి క్యాడర్ ఉందని, ఉప ఎన్నికలో సత్తా చాటుతాం పార్టీ నేతలు చెబుతున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గానికి సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి తదుపరి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానం మళ్లీ దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
పల్లాకు బాధ్యతలు అప్పగించిన కేసీఆర్
గత ఎన్నికల్లో ఇక్కడ ఓడిన అభ్యర్ధినే తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ అభ్యర్దిగా నిలబెట్టారు. ఎలాగైనా ఈ సారి గెలవాలని నిర్ధేశించారు. ఇందు కోసం అభ్యర్ధికి అండగా పార్టీ సీనియర్ నేత.. శాసన మండలిలో విప్ అయిన పల్లా రాజేశ్వర రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ అక్కడే ఉండాలని ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు..గ్రామాల్లోని పార్టీ నేతలను కలుపుకొని పోవాలని..గెలిచి రావాలని సూచించారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు రానుండటంతో ఈ ఫలితం ప్రభావం చూపిస్తుందని టీఆర్ యస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక, ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజవకర్గంలోని కార్యకర్తలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసారు. గత ఎన్నికల్లో అక్కడ ట్రాక్టర్ గుర్తు కారణంగా ఎనిమిది వేల ఓట్లతో పార్టీ అభ్యర్ధి ఓడారని..ఈ సారి ఖచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేసారు. త్వరలో కేటీఆర్ అక్కడ ప్రచారం చేయనున్నారు.