హుజూర్ నగర్ బరిలో సీపీఎం మద్దతు కోరిన టీడీపీ .. మద్దతు కష్టమే !
హుజూర్నగర్ ఉపఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావటంతో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. ఒకరిని మించి ఒకరు వ్యూహాలతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. హుజూర్ నగర్ ఓటర్ల మనసు గెలుచుకోవడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
ఎర్ర-గులాబీలు ఏకం అయ్యేనా...? హుజూర్ నగర్ ఉపపోరులో సరికొత్త సమీకరణాలు..!!
ఒక పక్క అధికార టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే . ఇక కాంగ్రెస్ పార్టీ కి కోదండరాం మద్దతు ప్రకటించారు. తెలంగాణా జనసమితి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుందని కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమ గీతం పాడాలని ఆయన ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలన్నారు . టీఆర్ఎస్ నిరంకుశ వైఖరిని తెలంగాణ సమాజం ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు .అయితే ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన టీడీపీ సీపీఎం మద్దతును కోరింది.
గత ఎన్నికల్లో పోటీ చేసే చావు దెబ్బ తిన్న టీడీపీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణా ఎన్నికల బరిలోకి దిగి సాహసమే చేసింది. అంతే కాదు ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలతో తలపడాలని నిర్ణయం తీసుకుంది. అందుకే సీపీఎం ను తమకు మద్దతు ఇవ్వాలని కోరిన నేపధ్యంలో మద్దతు వ్యవహారంపై సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంతో టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్లో మాట్లాడారు. పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని తమ్మినేని వీరభద్రం తెలిపారు.
తమ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ కావడంతో సీపీఎం బరిలో లేదు కాబట్టి సీపీఎం ను మద్దతు ఇవ్వాలని కోరారు టీడీపీ నేతలు . కానీ ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీపీఎం టీడీపీకి మద్దతు ఇవ్వటం ఒకింత కష్టమే అన్న భావన వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా టీడీపీ గత ఎన్నికల్లో ఊహించని దారుణ ఓటమిని చవి చూసినా, ఇప్పుడు మరో మారు ఎన్నికల రంగంలోకి దిగి పోరాటం చెయ్యనుంది . మరి మద్దతు కోరిన టీడీపీకి సీపీఎం నాయకులు హ్యాండ్ ఇస్తారో .. ఓకే చెప్తారో తెలియాల్సి వుంది.