పట్టుచీర చిరిగింది..! ఆర్టీసీ పరిహారం చెల్లించింది..! నల్గొండలో అరుదైన ఘటన..!!
నల్గొండ/ హైదరాబాద్ : మీ బస్సులో వెళితే పట్టుచీర చిరిగింది, నాకు పరిహారం చెల్లించాల్సిందే, అంటూ ఆర్టీసి మీద కేసు వేసిన ఓ వినియోగదారుడు చివరకు విజయం సాధించాడు. ఆర్టీసీ సంస్థ చేత పరిహారాన్ని అందుకున్నాడు. సిబ్బంది నిర్లక్ష్యంతో చీర చిరిగిందని భావించిన వినియోగదారుల ఫోరం రవాణా సంస్థకు 3వేల జరిమాన విధించింది. అసలు చీర చిరగడం ఏంటి.? ఆర్టీసి పరిహారం ఏంటి అనుకుంటున్నారా.. ఐతే ఇది చదవండి. నల్గొండకు చెందిన నరసింహరావు..వాణిశ్రీ భార్య భర్తలు. వీరిద్దరూ 2018 ఆగస్టు 26న హైదరాబాద్లో వివాహానికి వెళ్లేందుకు సూపర్ లగ్జరీ బస్సు (టీఎస్ 05 జెడ్ 0188) ఎక్కారు. అయితే బస్సు ఎంట్రీ వద్ద రేకు తెగింది. దీనికి తగులుకుని వాణిశ్రీ చీర చినిగిపోయింది.
ఇక ఈ విషయాన్ని బస్సు డ్రైవర్, కండక్టర్లకు నరసింహరావు తెలిపాడు. మరో మహిళ చీర కూడా చినిగిపోయింది. రేకును సరిచేస్తే అయిపోతుంది కదా అని డ్రైవర్ కి సూచిస్తే, అది మాపని కాదు, ఆర్టీసీ డిపో వారి పని అంటూ సెలవిచ్చారు సదరు డ్రైవర్. ఇక ఇదే విషయాన్ని డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు. నరసింహారావు. అయినా ఆర్టీసి నుండి స్పందన లేదు. దీంతో ఇదే విషయాన్ని ఛాంలెంజ్ గా తీసుకున్నాడు నరసింహారావు. దీనిని తేలికగా వదులుకోవద్దని..ఆర్టీసీకి తగిన బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. నల్గొండలోని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. టికెట్ బస్సు, బయటకు తేలిన రేకు, చిరిగిన చీర ఫొటోలను సాక్ష్యంగా సమర్పించారు. విచారణ చేపట్టిన ఫోరం, ఆర్టీసీ లోపం ఉందని నిర్ధారించింది. పట్టు చీరకు 2వేలు, ఇతర ఖర్చులకు 1000 రూపాయలు జరిమాన ఇవ్వాలని సదరు ఆర్టీసీ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది వినియోగదారుల ఫోరం. దీంతో తాము చేసిన పోరాటానికి ఫలితం దక్కిందటూ సంబరాల్లో మునిగిపోయారు వాణీశ్రీ, నరసింహరావుల జంట..!