టీఆర్ఎస్, బీజేపీకి డిపాజిట్లు రావు, సాగర్ సీటు కాంగ్రెస్దే.. జానారెడ్డి ధీమా..
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. టీఆర్ఎస్, బీజేపీకి విజయంతో సమాధానం ఇస్తామని చెబుతోంది. ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు నాగార్జునసాగర్లోని జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్, బీజేపీలు డిపాజిట్ల కోసం పోరాడాల్సిందేనన్నారు.
మాయమాటలతో మోసం చేసి ఓట్లు దండుకోవాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని జానారెడ్డి ధ్వజమెత్తారు. ఈసారి ప్రజలు ఆయన మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. తమ హయాంలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందే తప్ప ఈ ఆరేళ్ల కాలంలో అభివృద్ధి జరగలేదని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే అధికార పార్టీకి హామీలు గుర్తుకొస్తాయని ఆయన విమర్శించారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సమయం వచ్చినప్పుడు బుద్ది చెబుతారని తెలిపారు.
బీజేపీకి ఓటు బ్యాంకు లేదని జానారెడ్డి చెప్పారు. దుబ్బాకలో సానుభూతి పనిచేసిందని వివరించారు. గ్రేటర్లో అదీ కంటిన్యూ అయ్యిందని తెలిపారు. కానీ నాగార్జున సాగర్ సిచుయేషన్ వేరు అని వివరించారు. ఇక్కడ టీఆర్ఎస్- బీజేపీ పప్పులు ఉడకవ్ అని వెల్లడించారు. ప్రజాతీర్పుతో అదీ స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. కానీ ఆ రెండు పార్టీలు గొరంత కొండంత చేస్తున్నారని విమర్శించారు.