హుజూర్నగర్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం..?, స్పెషల్ ఆఫీసర్ను నియమించండి : బీజేపీ
హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. హుజూర్నగర్ రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు, ఆ పార్టీ నేతలు వివేక్, వీరేందర్ గౌడ్ ఉన్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని ఎన్నికల సంఘాన్ని వారు కోరారు. రిటర్నింగ్ అధికారి, పోలీసులు అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇదీ సరికాదని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక కోసం సర్పంచ్లు వేసిన నామినేషన్లను ఎందుకు స్వీకరించలేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. హుజూర్ నగర్ మరో నిజామాబాద్ అవుతుందని తీసుకోలేదా అని నిలదీశారు.
ఎవరి అండ, ధైర్యంతో రిటర్నింగ్ అధికారి ఈ సాహసం చేశరాని కొశ్చన్ చేశారు. హుజూర్ నగర్ బరిలో నిలిచేందుకు 60 మంది సర్పంచ్ లు నామినేషన్ వేస్తే నిరాకరించారని పేర్కొన్నారు. అంతేకాదు సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు భూమన్నపై కేసులు కూడా పెట్టారని గుర్తుచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచ్లు నామినేషన్ వేస్తే అడ్డుకుంటారా, ఇదేమీ రాజ్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.