హుజుర్నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయం : కేటీఆర్
హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ కార్యనిర్వహాక అధ్యక్షుడు కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో భాగంగా సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేటీఆర్ కార్యకర్తల సమావేశంలో పాల్గోని మాట్లాడారు. నల్గోండ జిల్లాను కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. జిల్లాను అభివృద్ది చేయకపోగా, కాంగ్రెస్ నేతలు జిల్లాను నట్టేట ముంచారని ఆయన దుయ్యబట్టారు.
హూజుర్నగర్లో ఎన్నికల శంఖరావాన్ని ప్రారంభించిన కేటీఆర్
అక్టోబర్ 21న నల్గోండ జిల్లా హూజుర్నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలోనే ఎన్నికల ప్రచార హోరు ఇప్పటి నుండే ప్రారంభమైంది. ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన మరునాడే టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ఎస్ ప్రచారంలో కూడ దూకుడును పెంచింది. ఎన్నికలకు మరో నెల రోజులు ఉన్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు . ఇందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ గెలిస్తే ఒరిగేదేమీ లేదు...
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గడిచిన 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తండాలను పంచాయితీలుగా చేస్తామని ప్రకటించిందని, కాని 2014లో గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయితీలుగా ప్రకటించిందని చెప్పారు. మరోవైపు నల్గోండ జిల్లాలో ఉన్న లక్ష్మినర్సింహ స్వామి ఆలయాన్ని కూడ కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. నామినేషన్ల సమయంలోనే గుడికి వచ్చి దర్శించుకునేవారిని, కాని గెలిచిన తర్వాత పట్టించుకోలేదని ఆయన దుయ్యబట్టారు. అలాంటీ ఆలయాన్ని తిరుమల దేవాలయానికి దీటుగా కోట్లాది రూపాలయతో అభివృద్ది చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే నియోజవర్గానికి ఒరిగేదేమీ లేదని చెప్పారు. అదే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మాత్రం నేరుగా ప్రభుత్వంతో మాట్లాడి అభివృద్ది చేస్తారని అన్నారు. ఇక నల్గోండ ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్ పార్టీదేనని కేటీఆర్ ఆరోపణలు చేశారు.
5 ఏళ్లలో నల్గోండకు మూడు మెడికల్ కాలేజీలు
మరోవైపు అయిదు సంవత్సరాల్లో నల్గోండ జిల్లాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలని ఆయన విజ్జప్తి చేశారు. జిల్లాను మూడు జిల్లాలుగా చేసి పరిపాలన సంస్కరణలు తీసుకువచ్చిందని అన్నారు. గత అయిదు అయిదు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలతో పాటు హామీ ఇవ్వని పథకాలను కూడ అమలు పరిచామని ఆయన ప్రకటించారు. బతుకమ్మ చీరలతోపాటు సన్నబియ్యం లాంటీ పథకాలు, నల్గోండ జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలను తీసుకువచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ అనే విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలని ఆయన సూచించారు.