హుజూర్నగర్లో గులాబీ జెండా రెపరెపలు.. విజయంపై మంత్రి జగదీశ్ ధీమా
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పాగా వేయబోతున్నామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తోందని చెప్పారు. నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నిక ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇదివరకు కన్నా విభిన్న వాతావరణం హుజూర్ నగర్ లో ఉందని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తమను కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. రెచ్చిగొట్టేందుకు ప్రయత్నించినా తాము సంయమనంతో ఉన్నామని చెప్పారు. హుజూర్ నగర్ ప్రజల హృదయాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందన్నారు. ఉప ఎన్నిక ఫలితమే ప్రతిపక్షాలకు సమాధానం అని స్పస్టంచేశారు.
టీఆర్ఎస్ అభివృద్ధి నినాదానికి ప్రజలు మద్దతు తెలిపారని చెప్పారు. వాస్తవానికి కేసీఆర్ సభ రద్దయిన ప్రజల మన్ననలు చూరగొన్నామని చెప్పారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సభ రద్దయిన సంగతి తెలిసిందే. కానీ టీఆర్ఎస్ శ్రేణులు గెలుపే లక్ష్యంగా పనిచేశారని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ మరింత ముందుకెళ్తుందని చెప్పారు. హుజూర్ నగర్ గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. తమకు ఇన్నాళ్లు ఉత్తమ్ ఏమీ చేయలేదని ప్రజలు గ్రహించారని చెప్పారు. మార్పు కోసం టీఆర్ఎస్ కు పట్టం కట్టారని ధీమా వ్యక్తం చేశారు.