హాజీపూర్ ఉదంతంపై సీఎం కేసీఆర్ బాధపడ్డారు.. సైకో శీనుగాడికి కఠిన శిక్ష ..! కేటీఆర్ హామీ
భువనగిరి : ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలను హత్యాచారం చేసి చంపిన హాజీపూర్ సైకో శీనుగాడి ఉదంతంలో ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్ను కలిశారు. అయినా కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
సైకో శీనుగాడిని జైలుకు పరిమితం చేయకుండా, ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ తాజాగా బొమ్మల రామారం మండల కేంద్రంలో గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. ఆ క్రమంలో అక్కడకు వచ్చిన టీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
హాజీపూర్ ఘటనపై పెదవి విప్పిన కేటీఆర్
హాజీపూర్ సైకో శీనుగాడి ఉదంతం వెలుగు చూసి మూడు వారాలకు పైగా అవుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే తొలిసారిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెదవి విప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
హాజీపూర్ సైకో శీనుగాడి వరుస హత్యలతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వాడు కనిపిస్తే కాల్చేయాలన్నంత కసితో ఉన్నారు. ఇప్పటికే గ్రామంలోని వాడి ఇంటిని తగులబెట్టారు. అదలావుంటే హాజీపూర్ గ్రామస్తులకు భరోసా ఇవ్వాలని మల్యాల సర్పంచ్ శ్రీనివాస్.. ట్విట్టర్ ద్వారా కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు.
సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించండి.. టీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న సైకో శీను బాధితులు
ఎన్నికల ఫలితాల తర్వాత ఊరికొస్తా.. న్యాయం చేస్తా..!
మల్యాల సర్పంచ్ శ్రీనివాస్ ట్వీట్పై స్పందించిన కేటీఆర్ ఆయనకు ఫోన్ చేశారు. హాజీపూర్ హత్యోదంతాలపై సీఎం కేసీఆర్ చాలా బాధపడ్డారని చెప్పుకొచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్న కేటీఆర్.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. అయితే లోక్సభ ఎన్నికల హడావిడి ముగిశాక.. హాజీపూర్కు వస్తానని సర్పంచ్కు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వరుస హత్యల ఎపిసోడ్లో హాజీపూర్ గ్రామస్తులు తగ్గడం లేదు. బొమ్మల రామారంలో మూడు రోజుల కిందట బాధిత కుటుంబాలు నిరాహారదీక్షకు దిగితే గ్రామస్తులు అండగా నిలిచారు. ఆ క్రమంలో సంఘీభావం తెలపడానికి అక్కడకు వచ్చిన టీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్తో సమావేశం ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా న్యాయం జరిగేనా?
హాజీపూర్లో వరుస హత్యాచారాల ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. శ్రావణి హత్యోదంతంతో వెలుగుచూసిన సైకో శీనుగాడి లీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. మనీషా, కల్పన అనే మరో ఇద్దరు బాలికలను కూడా వాడే చంపినట్లు పోలీసుల దర్యాప్తులో ఒప్పుకున్నాడు. అయితే ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలను సైకో శీనుగాడు అత్యాచారం చేసి చంపడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. వాడికి ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కేటీఆర్ హామీతో బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందేమో చూడాలి.