ఒకవైపు ఆర్టీసీ సమ్మె.. మరోవైపు డ్రైవర్ రిటైర్మెంట్.. తోటి కార్మికుల సత్కారం
కోదాడ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 28వ రోజుకు చేరింది. ఆ క్రమంలో ప్రభుత్వం మెట్టు దిగి రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. అయితే కోదాడలో ఆర్టీసీ డ్రైవర్ పదవీ విరమణ పొందడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు సమ్మె నడుస్తుండగానే మరోవైపు కోదాడ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ నారాయణ గురువారం (31.10.2019) నాడు రిటైర్మెంట్ అయ్యారు. అయితే ఆర్టీసీ తరపున ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ అందించి సత్కరించాల్సి ఉండగా సమ్మె నేపథ్యంలో అది కుదరలేదు. దాంతో తోటి కార్మికులు తామున్నామంటూ ఐకమత్యం చాటారు. నారాయణను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.
ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ.. కార్మికులు సమ్మెకు దిగి అష్ట కష్టాలు పడుతున్న ఈ సమయంలో తాను రిటైర్మెంట్ కావడం బాధాకరంగా ఉందన్నారు. అది తన దురదృష్టంగా భావిస్తున్నానని వాపోయారు. అయితే తాను పదవీ విరమణ పొందినప్పటికీ.. తోటి కార్మికులతో కలిసి సమ్మెలో పాల్గొంటానని తెలిపారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ నారాయణకు అండగా ఉంటామని ప్రకటించారు. ఆయనకు సంస్థ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అందేలా కృషి చేస్తామని చెప్పారు.
హయత్నగర్ టు ఆమంగల్.. కీర్తి రెడ్డికి అబార్షన్ చేసిందెవరు.. తల్లి హత్య కేసులో మరో కోణం..!
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే ప్రభుత్వం మొండిగా ప్రవర్తించడం సరికాదని మండిపడ్డారు జేఏసీ నేతలు. సీఎం కేసీఆర్ ఎన్ని కుయుక్తులు పన్నినా.. డిమాండ్ల సాధన కోసం వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు. ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులను పావులుగా వాడుకుని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తొక్కేయాలని చూడటం పద్దతి కాదన్నారు. ఆరునూరైనా సమ్మె విరమించే ప్రసక్తి లేదని.. ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని స్పష్టం చేశారు.