నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి .. భువనగిరిలో కోమటిరెడ్డి విజయం .. ఖాతా తెరిచిన కాంగ్రెస్
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో మొత్తం లోక్సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, సంబరాలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణా ప్రజలు షాక్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటికి రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సొంతం చేసుకుంది.
సారూ కారు ఓకే .. కానీ పదహారు మాత్రం ఓకే కాదంటున్న తెలంగాణా ఓటర్లు
రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం .. టీఆర్ ఎస్ కు ఊహించని షాక్
తెలంగాణాలో లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి పార్టీలో గందరగోళం సృష్టించారు కేసీఆర్ . అయినా సరే ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ నాయకులు ఈసారి ఎలాగైనా లోక్ సభ ఎన్నికల్లో పట్టు సాధించాలని చాలా కష్టపడ్డారు. భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గం పైనా , అలాగే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంపైనా కాంగ్రెస్ జెండా ఎగురవేశారు . నల్గొండ నుండి ఎన్నికల బరిలో నిలిచినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి వేంరెడ్డి నర్సింహారెడ్డిపై 23 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి .. భువనగిరిలో కోమటిరెడ్డి విజయం
ఇక భువనగిరి నుండి ఎన్నికల బరిలోకి దిగిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా 5వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక కోమటి రెడ్డి పై టీఆర్ ఎస్ నుండి పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్ ఓటమిని అంగీకరించి కౌంటింగ్ హాల్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. 2014 ఎన్నికల్లో కోమటి రెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడీ బూర నర్సయ్య గౌడ్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఆ ఓటమి తాలూకు రివెంజ్ తీర్చుకున్నారు కోమటి రెడ్డి బ్రదర్స్.
మరో రెండు స్థానాల్లో కూడా విజయావకాశం .. హోరాహోరీగా కాంగ్రెస్ పోరు
మల్కాజ్ గిరి, చేవేళ్ల స్థానాల్లో కొన్ని కాంగ్రెస్ అభ్యర్థులు టీఆర్ఎస్ కంటే ముందంజలో ఉన్నారు. ఈ స్థానాల్లో కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతుండటంతో ఈ స్థానాల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందన్న ఆశాభావంలో ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు . మొత్తానికి కాంగ్రెస్ పని అయిపోయిందని, లోక్ సభ ఎన్నికల్లో అసలే ఖాతా తెరవదని టీఆర్ఎస్ ప్రచారం చేసినా కాంగ్రెస్ రెండు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.