హుజూర్ నగర్ లో కేటీఆర్ వ్యూహం ఫలిస్తుందా..? ఫలితం అనుకూలమా..? ప్రతికూలమా..?
హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారాయి. ప్రజల ఆలోచనా విధానం మారింది. పరిస్థితులు అంతకన్నా వేగంగా మారాయి. తెలంగాణ సెంటిమెంట్ కు సంబంధిచిన హాంగోవర్ కూడా ప్రజల్లో సన్నగిల్లింది. ఇప్పుడు యావత్తెలంగాణలో వినిపిస్తున్న మాట ఒక్కటే..! ఆరున్నరేళ్ల స్వీయ పాలనలో సాధించుకున్నదేంటి..? బడుగు బలహీన వర్గాలకోసమే తెలంగాణ సాధించుకున్నమని ఉపన్యాసాలు ఇస్తున్న రాజకీయ నేతలు ఆ దిశగా అడుగులు పడ్డాయో స్పష్టత ఇవ్వాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ హుజూర్ నగర్ ఉప ఎన్నిక అధికార గులాబీ పార్టీకి గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా పార్టీకి అన్నీ తానై నడిపిస్తున్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సవాల్ గా మారింది.
ఎర్ర-గులాబీలు ఏకం అయ్యేనా...? హుజూర్ నగర్ ఉపపోరులో సరికొత్త సమీకరణాలు..!!
హుజూర్ నగర్ ఉప ఎన్నిక బాద్యత కేటీఆర్ దే.. గెలుపు అంత ఈజీ కాదంటున్న పార్టీ శ్రేణులు..
హుజూర్ నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ముఖ్య నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. రాజకీయాల్లో అపర చాణక్యుడిగానే కాకుండా ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించి దిమ్మతిరిగేలా చేయగలడనే ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు కూడా హుసూర్ నగర్ ఉప ఎన్నిక అంశంలో జంకుతున్నట్టు తెలుస్తోంది. ఏ ఎన్నికలనైనా ఒంటి చేత్తో సాహసోపేతంగా ఎదుర్కొనే చంద్రశేఖర్ రావు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తడబడుతున్నట్టు గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఇదే ఉప ఎన్నిక పార్టీ కార్యనిర్వాహక అద్యక్షుడు కేటీఆర్ కు కూడా శరాఘాతంలా పరిణమించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
పొత్తులకోసం ప్రయత్నాలు.. సన్నగిల్లిన గులాబీ ఆత్మవిశ్వాసం..
తెలంగాణలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నామమాత్రంగా పాలన కొనసాగిస్తున్నా, తెర వెనుక అంతా తనయుడు కేటీఆర్ కనుసన్నల్లో జరిగిపోతుందనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. గత ప్రభుత్వంలోఐటీ, పురపాలక, మంత్రిగా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హరీష్రావుకు రాజకీయాల్లో ప్రాధాన్యతను క్రమంగా తగ్గించి, చెల్లి కవితకు చేయూతనివ్వడంలో కేటీఆర్ కొంత మేర విజయం సాధించారు. ఆ తర్వాత మంత్రులను కూడా నామమాత్రంగా మార్చేసి, కేటీఆర్ తెలంగాణలో చక్రం తిప్పుతున్నారనే అపవాదును కూడా కూడగట్టుకున్నారు.
కేటీఆర్ కు సమస్యల స్వాగతం.. మంత్రిగా బాద్యతలు తీసుకున్న మరుక్షణమే పలు సవాళ్లు..
అంతే కాకుండా 2018 ముందస్తు ఎన్నికల్లోనూ హరీష్రావు కంటే కేటీఆర్ చురుకైన పాత్ర పోషించారు. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 21 సీట్లు గెలిచేందుకు ఎంతగానో శ్రమించారు. ఐతే అది గతం. పరిస్ధితులు నెమ్మదిగా మారుతూ వచ్చాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో కేటీఆర్ వ్యూహం ఫలించలేదు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి రెండూ ఎంపీ స్థానాలు చేజారాయి. అంతే కాకుండా నిజామాబాద్ లో స్వయంగా కవిత ఓడిపోవడం మింగుడు పడని అంశంలా మారింది. దీంతో పార్టీలో చెప్పలేని అసంతృప్తి చోటుచేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. పరిస్దితి మరింత చేజారకుండా ఉండేందుకు చంద్రశేఖర్ రావు మంత్రి వర్గ విస్తరణను చేపట్టారు. హరీష్ రావుతో పాటు, కేటీఆర్ కు క్యాబినెట్ లో స్థానం కల్పించి పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేసారు చంద్రశేఖర్ రావు.
కేటీఆర్ పై ప్రతిపక్షాల ఆరోపణలు.. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని విమర్శలు..
ఆ తర్వాత కేటీఆర్కు రాష్ఠ్రంలో చోటుచేసుకున్న అనేక సమస్యలు స్వాగతం పలికాయి. పదవి చేపట్టగానే డెంగ్యూ జ్వరాలు, రహదారి నిర్మాణాలు, పట్టణాల వెనుకబాటుతనం, పల్లెల్లో సర్పంచ్లకు నిధుల లేమి, పార్టీలో ఐకమత్యం లోపించటం, తాజాగా హుజూర్నగర్ ఉప ఎన్నిక బాద్యతలు కేటీఆర్ భుజాలపై పడ్డాయి. అంతే కాకుండా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పాడైపోయిన రోడ్లు, జలమయమైన కాలనీలు మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ను చిక్కుల్లోకి నెట్టాయి. వీటిని సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేసేందుకు కేటీఆర్ తడపడుతున్నట్టు తెలుస్తోంది. పైగా గతంలో అనుకూలంగా ఉన్న మీడియా కూడా ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది. నిన్నటి వరకూ భావి సీఎం కేటీఆర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తిన వారు కూడా విమర్శలు కురిపిస్తున్నారు. కేవలం విదేశీ యాత్రలు, సినీతారలతో డిన్నర్ కే కేటీఆర్ సమయం వెచ్చిస్తున్నారంటూ మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిణామాల మద్య కేటీఆర్ పై ఉంచిన హుజూర్ నగర్ గెలుపు బాద్యతను ఎంతవరకు సఫలీకృతం చేస్తారనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారింది.