ఆన్లైన్ ఛీటింగ్.. వయస్సు 28.. 20 కోట్ల మోసం
నంద్యాల : చెప్పేవాడికి వినేవారు లోకువ అన్నట్లు తయారవుతోంది నేటి పరిస్థితి. సోషల్ మీడియాతో మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతోంది. తాజాగా మరో ఆన్లైన్ మోసం వెలుగుచూసింది. నిందితుడు చాకచక్యంగా వ్యవహరించి రెండు రాష్ట్రాల్లో నమ్మినవారిని నట్టేట ముంచాడు. వయస్సు 28 ఏళ్లే ఐనా.. దాదాపు 20 కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వెంకటకృష్ణ భారీ మోసానికి తెర తీశాడు. సోషల్ మీడియా వేదికగా కుచ్చుటోపీ పెట్టాడు. వాట్సాప్, యూట్యూబ్ తో జనాలకు ఎక్స్ట్రా మనీ ఆశజూపి అందినకాడికి దండుకున్నాడు. ఈ మాయగాడి వలకు వందల సంఖ్యలో చిక్కినట్లు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా వ్యవహరించిన వెంకటకృష్ణ.. ఈ ఏడాది జూన్ లో యూట్యూబ్ వీడియో లింకును వాట్సాప్ ద్వారా చాలా నంబర్లకు పంపించాడు. తన అకౌంట్లో డబ్బులు వేస్తే..
అధికమొత్తంలో తిరిగి ఇస్తాననేది దాని సారాంశం. అక్కడితో ఆగకుండా వాట్సాప్ లో ఏకంగా ఓ గ్రూప్ క్రియేట్ చేశాడు. మనీ మేక్స్ మనీ (Triple M) పేరుతో ఉన్న ఆ గ్రూప్ లో చాలామంది చేరారు. గ్రూప్ సభ్యులతో తరచుగా మాట్లాడుతుండేవాడు. ఎవరైనా ఆయన వివరాలు అడిగితే.. ఐటీ ప్రాబ్లమ్స్ అని తప్పించుకునేవాడు. ఇలా వెంకటకృష్ణ మాయమాటలు నమ్మి అడిగినంత సమర్పించుకున్నారు.
ఎవరికివారు తమకెందుకులే అనుకోవడంతో వెంకటకృష్ణ ఆన్లైన్ మోసం బయటకురాలేదు. చివరకు ఆ వాట్సాప్ గ్రూపులోని ఓ సభ్యుడు.. వెంకటకృష్ణ దొరికాడనే సమాచారం పెట్టడంతో ఒక్కొక్కరుగా బయటకొచ్చారు బాధితులు. నంద్యాల మూడో టౌన్ పీఎస్ లో వెంకటకృష్ణ ఉన్నాడని చెప్పడంతో పదుల సంఖ్యలో బాధితులు అక్కడకు చేరుకోవడంతో ఈ మోసం వెలుగుచూసింది.