మరో రివర్స్ టెండర్: 30 నెలల్లో ప్రాజెక్టు పూర్తి: రాయలసీమ ఎత్తిపోతల అంచనా విలువ ఇదీ
నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణానికి అడుగులు పడ్డాయి. రాయలసీమలో నాలుగు జిల్లాలకు సాగునీటిని అందించడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన టెండర్ల ప్రక్రియ ఆరంభమైంది. ఈ ప్రాజెక్టు విలువను ప్రభుత్వం 3278.18 కోట్ల రూపాయలుగా నిర్ధారించింది. 3278 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చేపట్టబోతోంది ప్రభుత్వం.
బీజేపీలోని టీడీపీ మాజీలకు చెక్ పెట్టేలా: కన్నాను తొలగించిన రోజే..షోకాజ్ జారీ: భారీ ప్రక్షాళన
దీనికి అవసరమైన టెండర్ల ప్రక్రియ సోమవారం ఆరంభమైంది. కర్నూలు జిల్లా నంద్యాల డివిజనల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ అధికారులు టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. ఇంజినీరింగ్-ప్రొక్యూర్మెంట్-కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిన టెండర్ల ప్రక్రియను చేపట్టారు. వచ్చే నెల 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు టెక్నికల్ బిడ్ను తెరుస్తారు. అర్హులైన కాంట్రాక్టర్లకు అప్పటికప్పుడు ప్రాజెక్టు నిర్మాణ పనులను అప్పగించే అవకాశం లేదు.
రివర్స్ టెండరింగ్ వ్యవస్థను ప్రభుత్వం ఇందులో అమలు చేయబోతోంది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియను 17వ తేదీన నిర్వహిస్తారు. దాని తరువాతే టెండర్ను ఖరారు చేస్తారు. 19వ తేదీన కాంట్రాక్టు పనులను ఎవరికి కేటాయించేదీ తేలుతుందని అధికారులు వెల్లడించారు. 3,278 కోట్ల రూపాయల అంచనాతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినప్పటికీ.. రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ మొత్తం మరింత తగ్గే అవకాశం లేకపోలేదు.
కృష్ణా జలాలపై నిర్మించిన శ్రీశైలం రిజర్వాయర్ మిగులు జలాలను రాయలసీమ ప్రాంతానికి తరలించడానికి ఉద్దేశించిన పోతిరెడ్డి పాడు విస్తరణలో భాగంగా ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ప్రారంభంలో దీనికి అనేక అవాంతరాలు ఏర్పడ్డాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటీషన్ దాఖలు కావడంతో టెండర్ల ప్రక్రియను చేపట్టడంలో జాప్యం ఏర్పడింది. దీనిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ కొద్దిరోజుల కిందటే ప్రభుత్వానికి అనుకూలంగా ఆదేశాలను ఇచ్చింది.
Recommended Video
టెండర్ల ప్రక్రియను నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. టెండర్ల ప్రక్రియను నిర్వహించుకోవడానికి మాత్రమే ఈ అనుమతి లభించింది. దీనిపై తదుపరి విచారణ వచ్చేనెల 11వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. 11వ తేదీన ఎన్జీటీ నుంచి తుది విచారణ వెలువడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే 13వ తేదీన టెక్నికల్ బిడ్స్ను తెరిచేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.