అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య: నంద్యాల సీఐ అరెస్ట్, క్రిమినల్ కేసు నమోదు
కర్నూలు: జిల్లాలోని నంద్యాలలో ఇటీవల అబ్దుల్ సలాం అనే ఆటో డ్రైవర్ తన నలుగురు కుటుంబసభ్యులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే సీఐని సస్పెండ్ చేశారు.
నంద్యాల సీఐపై క్రిమినల్ కేసు
తాజాగా, సీఐ సోమశేఖర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు డీఐజీ వెంకట్రామిరెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో ఐజీ శంకబ్రత బాగ్చి నంద్యాల చేరుకుని విచారణ చేపట్టారు.
పోలీసుల వేధింపులతోనే ఆత్మహత్య..
కొంతమంది కానిస్టేబుళ్లను ఐజీ ప్రశ్నించారు. ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం ఆటోలో నగదు పోయినట్లు ఫిర్యాదు చేసిన భాస్కర్ రెడ్డిని కూడా పోలీసులు వివిధ అంశాలపై విచారించారు. ఇటీవల కౌలూరు వద్ద అబ్దుల్ సలాం తన కుటుంబసభ్యులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. కాగా, పోలీసులు తప్పుడు కేసు పెట్టారంటూ అబ్దుల్ సలాం ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఆదివారం రాత్రి వెలుగులోకి రావడంతో ఈ కేసు మలుపుతిరిగింది.
అబ్దుల్ సలాం ఫ్యామిలీ ఆత్మహత్య.. ఏపీ సర్కారు సీరియస్
ఏడాది క్రితం బంగారం దుకాణంలో చోరీ కేసులో అబ్దుల్ సలాంను నిందితుడిగా చేర్చారు. తాను చేయని దొంగతనం కేసులో తనపై ఒత్తిడి పెంచి వేధింపులకు గురిచేస్తున్నారని.. తీవ్ర మనస్తాపం చెందిన అబ్దుల్ సలాం సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నలుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడటంతో ప్రభుత్వం ఈ కేసుపై తీవ్రంగా స్పందించింది. వెంటనే బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సీఐతోపాటు హెడికానిస్టేబుల్ను అరెస్టు చేసిన పోలీసులు.. లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న సర్కారుకు మైనార్టీ నేతలు ధన్యవాదాలు తెలిపారు.