నంద్యాలలో ఎస్పీవై రెడ్డి గెలిస్తే జరిగేదేంటి..? గత సందర్బాలకు భిన్నంగా ఎమన్నా జరగుతుందా..?
అమరావతి/హైదరాబాద్ : మరో పది రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొన్ని లోక్సభ స్థానాలపై ఉత్కంఠ రేగింది. హేమాహేమీలు బరిలో ఉండటంతో ఎవరు గెలుస్తారన్న విషయంలో తీవ్ర చర్చ జరుగుతోంది. పోలింగ్ ముగిశాక కూడా ఎవరు గెలుస్తారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ, బెట్టింగులు సాగుతున్నాయి. అయితే.. తాజాగా ఓ స్థానంపై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు జరిగే సమయంలో ఈ స్థానం పెద్దగా చర్చకు రాకపోయినా.. తాజాగా మాత్రం అక్కడ ఎవరు గెలుస్తారన్నది ఆసక్తి రేపుతోంది. గెలిచే అభ్యర్థి జనసేన పార్టీ అయితే ఏంజరుగుతుంది అనే చర్చ తారా స్థాయిలో నడుస్తోంది. ఇందుకు కారణం జనసేన తరపున పోటీ చేసిన ఆ అభ్యర్థి ప్రస్తుతం జీవించి లేకపోవడమే..! మరి చనిపోయిన అభ్యర్థి గెలిస్తే ఏం జరుగుతుంది..? రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి విజయం కట్టబెడతారా..? లేదా ఉప ఎన్నిక వస్తుందా..? ఎన్నికల నిబంధనలు ఏం చెబుతున్నాయి..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఉత్కంఠగా మారిన నంద్యాల ఫలితం..! జీవించిలేని అభ్యర్తి గెలిస్తే ఏంటి పరిస్థితి..!!
కర్నూలు జిల్లా నంద్యాల లోక్సభ ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. ఇక్కడ టీడీపీ నుంచి శివానందరెడ్డి, వైసీపీ నుంచి బ్రహ్మానందరెడ్డి, జనసేన తరపున ఎస్పీవై రెడ్డి పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో కొంతకాలం పాటు కొనసాగారు. ఎన్నికల ముందు జనసేన గూటికి చేరి, ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. పది రోజుల కిందట ఎస్పీవై రెడ్డి మృతి చెందారు. నాలుగు రోజుల కిందట నంద్యాల స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్ కార్యాలయం కూడా ప్రకటించింది. అయితే.. ఎన్నికల పోలింగ్కు ముందు అభ్యర్థి చనిపోతే.. సహజంగా పోలింగ్ను ఎన్నికల సంఘం వాయిదా వేస్తుంది.
కన్ను మాసిన జనసేన అభ్యర్థి..! ఎన్నికల నియమావళి ఏం చెబుతోంది..!!
కానీ ఎన్నికలయ్యాక చనిపోవడంతో ఫలితాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎస్పీవై రెడ్డి చనిపోయారు కనుక ఎన్నికల్లో ఆయన గెలిస్తే ఏమవుతుందన్న చర్చ అందరి మొదలైంది. మళ్లీ ఉప ఎన్నిక వస్తుందా..? లేదా ఎస్పీవై రెడ్డి జీవించి లేరు కనుక రెండో స్థానం సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారా.. ?అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిశాక అభ్యర్థి చనిపోతే.. ఆయనకు పోలైన ఓట్లు కూడా లెక్కిస్తారు. ఈ సందర్భంగా అతను విజేతగా నిలిస్తే.. ఎన్నిక రద్దు అవుతుంది.
రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారా..! ఈసి నిర్ణయం ఏంటి..!!
గెలిచిన అభ్యర్థి జీవించి లేడు కనుక తిరిగి ఉప ఎన్నిక జరుగుతుంది. అంతేకానీ రెండోస్థానంలో నిలిచిన అభ్యర్థికి విజేతగా ప్రకటించే అవకాశాలు ఉండవు. ఆరు నెలల్లోగా అక్కడ ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. అదే చనిపోయిన అభ్యర్థి గెలవకపోతే, ఈ ఆలోచనే అవసరం ఉండదు. విజేత ఎలాగూ బతికే ఉన్నాడు కనుక చనిపోయిన అభ్యర్థి గురించి పట్టించుకోనవసరం లేదు. 2014 ఎన్నికల సమయంలోనూ పోలింగ్కు 24 గంటల ముందు ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్థి శోభానాగిరెడ్డి మృతి చెందారు.
గతంలో శోభానాగిరెడ్డి ఇలాగే జీవించి లేరు..! ఉప ఎన్నిక అనివార్యం..!!
అయితే.. ఎన్నిక అప్పటికప్పుడు వాయిదా వేయడం సాధ్యం కాదు కనుక ఎన్నికల సంఘం వాయిదా వేయలేదు. ఆ ఎన్నికల్లో శోభానాగిరెడ్డి చనిపోయిందని తెలిసినా.. ఓటర్లు ఆమెకే పట్టం కట్టారు. ఆమెను విజేతగా ప్రకటించిన ఎన్నికల సంఘం.. ఆమె జీవించి లేకపోవడంతో తిరిగి ఉప ఎన్నిక నిర్వహణకు చర్యలు తీసుకుంది. ఆ తర్వాత జరిగి ఉప ఎన్నికలో ఆళ్లగడ్డ నుంచి శోభానాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి నంద్యాల లోక్సభ ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి గెలిస్తే.. తిరిగి ఉప ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల నియమావళి కూడా ఇదే నిర్థారిస్తోంది.