అడకత్తెరలో ఎస్పీవై రెడ్డి: నంద్యాల ఎంపీ టికెట్ కోసం తంటాలు: షరతులు పెట్టిన టీడీపీ
నంద్యాల: సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ కర్నూలు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాలు సిట్టింగులకు దక్కే అవకాశాలు ఏ మాత్రం కనిపించట్లేదు. ఆ ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు 2014 నాటి ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున లోక్ సభకు ఎన్నికై, పార్టీ ఫిరాయించిన వారే. కర్నూలు, నంద్యాల లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను మార్చడం ఖాయమైంది.
అశోక్ అమెరికా లో ఉన్నా.. : డేటా ఎవరిచ్చారనేది ముఖ్యం : ఐటి గ్రిడ్స్లో తెలంగాణ డేటా: స్టీఫెన్..
కర్నూలు సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు ఆదోని అసెంబ్లీ టికెట్ దక్కే అవకాశాలు ఉండగా.. నంద్యాల సిట్టింగ్ లోక్ సభ సభ్యుడు ఎస్పీవై రెడ్డి పరిస్థితి అడకత్తెరలో చిక్కుకుంది. ఆయనకు టికెట్ దక్కదని జిల్లా టీడీపీ నాయకులు బాహటంగా చెబుతున్నారు. టీడీపీలో ఆయనకు నంద్యాల లోక్ సభ టికెట్ కావాలంటే.. కనీసం 60 కోట్ల రూపాయలను చేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి ఎదురైందని అంటున్నారు.
2014 లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున నంద్యాల ఎంపీగా పోటీ చేసి, విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో వైఎస్ఆర్ సీపీ నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఆయన పార్టీ ఫిరాయించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను అధికార పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ అయిదేళ్లూ టీడీపీలో గడిపేశారు. టీడీపీలో టికెట్ దక్కుతుందనే భరోసా ఉన్నారు. ఎన్నికలు సమీపించే సమయానికి పరిస్థితి మారిపోయింది.
తెలుగుదేశం పార్టీలో కొత్తగా మాండ్ర శివానంద రెడ్డి పేరు వినిపిస్తోంది. నందికొట్కూరుకు చెందిన మాండ్ర శివానంద రెడ్డి చాలాకాలంగా టీడీపీలో పనిచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అదనపు ఎస్పీ హోదాలో పనిచేసి, పదవీ విరమణ చేసిన అనంతరం టీడీపలో చేరారు. క్రియాశీలకంగా ఉన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డికి సమీప బంధువు కూడా. నంద్యాల ఎంపీ సీటును తనకు కేటాయించాలని ఆయన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ సారి దాదాపు టికెట్ ఆయనకే దక్కే అవకాశాలు ఉన్నాయి.
దీనితో ఎస్పీవై రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొద్దిరోజుల కిందటే ఆయన తన అల్లుడు శ్రీధర్ రెడ్డిని వెంటబెట్టుకుని అమరావతిలో చంద్రబాబును కలిశారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ.. చంద్రబాబును కలిసి, టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు నుంచి ఎలాంటి భరోసా రాలేదు. ఈ సారి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని, వరుసగా మూడుసార్లు గెలిచిన తరువాత నాలుగోసారి ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు సర్వేలో తేలిందని చంద్రబాబు ఆయనకు క్లాస్ తీసుకున్నట్లు చెబుతున్నారు. టికెట్ ఖాయం చేసుకోవాలంటే.. కనీసం 60 కోట్ల రూపాయలను పార్టీ ఫండ్ గా డిపాజిట్ చేయాల్సి ఉంటుందని సూచించారట.
దీనితో బిత్తరపోయిన ఎస్పీవై రెడ్డి, తనకు కాకపోతే, తన అల్లుడికైనా నంద్యాల ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరగా.. దానికీ చంద్రబాబు అంగీకరించలేదని తెలుస్తోంది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు ఎస్పీవై రెడ్డి దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు అభిమానులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ సీపీలో చేరవచ్చని తెలుస్తోంది. అక్కడ కూడా ఆయకు టికెట్ దక్కకపోవచ్చు.