భూమా సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర..50 లక్షలు డీల్..ఎవరు చంపాలనుకున్నారు..?
ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కర్నూలు జిల్లాలో మరోసారి అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతోందా..? దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆప్తమిత్రుడు టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని హతమార్చేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఆళ్లగడ్డ నంద్యాలలో మంచి పట్టున్న నేతగా గుర్తింపు పొందిన ఏవీ సుబ్బారెడ్డి హత్య కుట్రను కడప పోలీసులు భగ్నం చేశారు.
ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర
కర్నూలు జిల్లాలో ఏవీ సుబ్బారెడ్డి అంటే తెలియని వారుండరు. దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడు. భూమా నాగిరెడ్డికి కుడిభుజంగా వ్యవహరిస్తారు ఏవీ సుబ్బారెడ్డి. ప్రస్తుతం టీడీపీలో ఏవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. అయితే ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కొందరు కుట్రపన్నారని పోలీసులు చెబుతున్నారు. ఆ కుట్రను భగ్నం చేసినట్లు చెప్పారు. కడప జిల్లాలో ఏవీ సుబ్బారెడ్డి హత్యకు స్కెచ్ వేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు అత్యంత చాకచక్యంగా నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు.
రూ.50 లక్షలు డీల్
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఏవీ సుబ్బారెడ్డి హత్యకు మొత్తం రూ.50 లక్షలు డీల్ నిందితులు కుదర్చుకున్నట్లు కడప డీఎస్పీ సూర్యనారాయణ చెప్పారు. నిందితుల నుంచి రూ.3.2 లక్షల నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక పిస్టల్, 6 తూటాలు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక అరెస్టు అయిన నిందితుల్లో సంజురెడ్డి అనే వ్యక్తి సూడో నక్సలైట్గా విచారణలో వెల్లడైంది. ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు హైదరాబాదులోని తన ఇంటిని రెండు సార్లు రెక్కీ నిర్వహించారని పోలీసులు తెలిపారు. అయితే హైదరాబాదు పోలీసులను చూసి భయపడి నిందితుడు వెనక్కు తగ్గినట్లు కడప పోలీసులు చెప్పారు. అరెస్టు అయిన నిందితులపై గతంలో పలు కేసులు ఉన్నట్లు సమాచారం.
హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది..?
ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరుకుంటుందనే చర్చ ఇప్పుడు కర్నూలు కడప జిల్లాల్లో నడుస్తోంది. ఇక ఏవీ సుబ్బారెడ్డి రాజకీయ చరిత్ర చూస్తే 2009లో నాడు చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం నుంచి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2014లో భూమా కుటుంబం వైసీపీలో చేరడంతో వారితో పాటే వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం భూమా కుటుంబం తిరిగి టీడీపీలో చేరడంతో నాగిరెడ్డితో పాటే ఏవీ సుబ్బారెడ్డి కూడా టీడీపీలో చేరారు. భూమానాగిరెడ్డి హఠాన్మరణంతో ఒంటరైపోయిన ఏవీ సుబ్బారెడ్డి అంతా తానై నడింపించాలని భావించారని కర్నూలు జిల్లాలో చెబుతుంటారు. భూమా నాగిరెడ్డి కుమార్తె మాజీ మంత్రి అఖిల ప్రియతో పాటు ఆమె ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఇది రుచించలేదనేది సన్నిహితులు చెబుతుంటారు. దీంతో ఏవీ సుబ్బారెడ్డిని దూరంగా ఉంచారనేది బహిరంగ రహస్యమే. వీరిద్దరి మధ్య సైలెంట్ వార్ ముదిరి పాకాన పడిన సమయంలో పార్టీ మారుదామని ఏవీ సుబ్బారెడ్డి దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం.
ఏవీ సుబ్బారెడ్డిని దూరం పెట్టిన భూమా అఖిలప్రియ
అప్పుడే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో నంద్యాల అసెంబ్లీకి ఉపఎన్నికలు రావడం అక్కడి నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి నిలవడంతో అతని వర్గానికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారు ఏవీ సుబ్బారెడ్డి. ఇక ఈ పంచయతీ టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు చేరడంతో అతనికి నామినేటెడ్ పోస్టు ఇస్తానని హామీ ఇచ్చి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపునకు కృషి చేయాలని సూచించారు. చెప్పినట్లుగానే ఏపీ సీడ్స్ కార్పొరేషన్ పదవిని ఏవీ సుబ్బారెడ్డికి కట్టబెట్టారు చంద్రబాబు. ఇక భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల ఉపఎన్నికల్లో గెలిచాక ఏవీ సుబ్బారెడ్డిని పూర్తిగా దూరం పెట్టేశారు. 2019లో నంద్యాల టికెట్ కోసం ఏవీ సుబ్బారెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డిలు ప్రయత్నించగా ఇద్దరికీ కాదని చంద్రబాబు గఫూర్కు కేటాయించారు. ఇక భూమా ఆస్తులకు ఏవీ సుబ్బారెడ్డి బినామీ అనేది ప్రచారంలో ఉంది. ఇక్కడే భూమా అఖిల ప్రియకు ఏవీ సుబ్బారెడ్డిల మధ్య ఆస్తుల విషయంలో విబేధాలు వచ్చాయని సన్నిహితులు చెబుతుంటారు. హైదరాబాదులో ఏవీ సుబ్బారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారని సమాచారం. ఇక ఇదే ఆస్తులపై మాజీ మంత్రి అఖిలప్రియ అతని సోదరుడు విశ్వవిఖ్యాత్ రెడ్డిల మధ్య కూడా విబేధాలు తలెత్తడం.. ఆపై కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది.
మొత్తానికి ఏవీ సుబ్బారెడ్డిని హత్య ఎందుకు చేయాలనుకున్నారు, వ్యాపారపరమైన విబేధాలు తలెత్తి నిందితులకు ఎవరైనా సుపారీ ఇచ్చారా.. లేక రాజకీయపరమైన విబేధాలతో హత్య చేయాలని చూశారా అన్న విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. అయితే పూర్తి వివరాలను విచారణ చేశాకే చెబుతామని పోలీసులు వెల్లడించారు.