ఏవీ సుబ్బారెడ్డి హత్యాయత్నం కేసు: భూమా అఖిలప్రియ భర్తకు పోలీసుల నోటీసు
అమరావతి: టీడీపీ నేత, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్కు శుక్రవారం పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.
నా హత్యకు రూ. కోటి డీల్: భూమా అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలనం, పోలీసుల వల్లే..
అఖిలప్రియ భర్తకు పోలీసు నోటీసులు
ఏవీ సుబ్బారెడ్డి హత్య కుట్ర కేసులో ఇటీవల నలుగురు నిందితులను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, తన హత్యకు కుట్ర పన్నింది భూమా అఖిలప్రియ దంపతులేనని ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని అఖిలప్రియ భర్తకు నోటీసులిచ్చినట్లు సమాచారం. హత్య కుట్ర కేసులో మే 15న మధ్యవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సుబ్బారెడ్డి హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసులు
కాగా, ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర చేస్తుండగా కడప పోలీసులు ఆ ప్రయత్నాన్ని భగ్నం చేశారు. ఏవీ సుబ్బారెడ్డి హత్యకు సుపారీ తీసుకున్న ముగ్గురు నిందితులను కడపలో చిన్నచౌకు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో నివాసముంటున్న సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు ఫక్కీర్ కొందరు ప్రముఖ రాజకీయ నేతల వద్ద రూ. 50 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుర్తించారు. మొదట రూ. 15 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు.
హైదరాబాద్లో హత్యకు కుట్ర
సుబ్బారెడ్డిని చంపేందుకు మార్చి 12న తెల్లవారుజామున 3 గంటలకు ఫక్కీర్ ఒంటరిగా వెళ్లాడు. అదే సమయంలో హైదరాబాద్ లో రాత్రి పెట్రోలింగ్ పోలీసులు తిరుగుతుండటంతో అక్కడి నుంచి వెనక్కి వచ్చేశాడు. ఈ క్రమంలోనే కడప పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
Recommended Video
తనకు నోటీసులందలేదంటూ అఖిలప్రియ
ఇది ఇలావుండగా, తన హత్యకు కుట్ర కేసులో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ హస్తం ఉందని ఆరోపించిన ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై అఖిలప్రియ స్పందించారు. సుబ్బారెడ్డి ఆరోపణల వెనక ఆళ్లగడ్డ అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండొచ్చని అన్నారు. ఓ కేసులో తన భర్త భార్గవ్ రామ్ కు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నామని, దీన్ని పక్కదారి పట్టించేందుకు సుబ్బారెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సుబ్బారెడ్డి హత్య కేసులో తనకు ఎలాంటి నోటీసులు అందలేదని అఖిలప్రియ చెప్పారు. ఏవీ సుబ్బారెడ్డికి పదవులిస్తే తాను అడ్డుకోలేదన్నారు. ఏవీ సుబ్బారెడ్డిని ఆళ్లగడ్డలో రాజకీయాలు చేయొద్దని చెప్పలేదని, ఆళ్లగడ్డలో రాజకీయాలు చేస్తానంటే స్వాగతిస్తానని అఖిలప్రియ వ్యాఖ్యానించారు.