నంద్యాలలో గర్భిణి దారుణ హత్య... కత్తితో దాడి చేసిన మహిళ... అదే కారణం...?
కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. ఓ నిండు గర్భిణి హత్యకు గురైంది. తన తండ్రితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో ఆమె వాగ్వాదానికి దిగగా కత్తితో దాడి జరిగింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళ్తే... నంద్యాల పట్టణానికి చెందిన లక్ష్మి ప్రస్తుతం 8 నెలల గర్భిణి. ఆమె తండ్రి వెంకట రాముడు తల్లిని నిర్లక్ష్యం చేస్తూ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై లక్ష్మి,ఆమె తల్లి కలిసి తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను బుధవారం(సెప్టెంబర్ 30) నిలదీశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇదే క్రమంలో సదరు మహిళ తీవ్ర కోపోద్రిక్తురాలై లక్ష్మిపై కత్తితో దాడి చేసింది. 8 నెలల గర్భంతో ఉన్న లక్ష్మికి కడుపులో కత్తి బలంగా దిగడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.