ఫేక్ కంపెనీల గురించి తెలుసుకోవాలంటే జగన్ నేర చరిత్ర చదవమని మంత్రికి నారా లోకేష్ సలహా
ఏపీలో వైసీపీ మంత్రులు, టీడీపీ నేతల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటీవల ఫేక్ కంపెనీల పేరుతో వెయ్యి ఎకరాలకు ఎర్త్ పెట్టారని చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్, ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డిలపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. రిలయన్స్ పేరుతో ఓ నకిలీ కంపెనీని సృష్టించి 1000 ఎకరాలు కొట్టేసేందుకు తాము ప్రయత్నించినట్లు మంత్రి గౌతమ్ రెడ్డి ఆరోపించడాన్ని ఆయన ఖండించారు.
రిలయన్స్ పేరుతో భూములు కొట్టేసేందుకు టీడీపీ ప్లాన్ చేసిందన్న మంత్రి గౌతమ్ రెడ్డి
ఫేక్ కంపెనీల పేరుతో టీడీపీ ఏం చేసిందో మీడియా సమావేశంలో చెప్పిన మంత్రి గౌతమ్ రెడ్డి తిరుపతి సమీపంలో పరిశ్రమ ఏర్పాటుకు 1000 ఎకరాలు ఇవ్వాల్సిందిగా గత ప్రభుత్వానికి రిలయన్స్ సంస్థ పేరుతో దరఖాస్తు వచ్చిందని, ఈ ఫైల్ గత టీడీపీ ప్రభుత్వ కేబినెట్ ఆమోదం కోసం కూడా వెళ్లిందాని చెప్పారు . ఇక అసలు విషయం ఏమిటంటే ఇది అంబానీలు నడుపుతున్న రిలయన్స్ కంపెనీ కాదు అని తేలినట్టు గౌతమ్ రెడ్డి వివరించారు. అదో ఫేక్ కంపెనీగా నిర్ధారించామని రిలయన్స్ పేరుతో భూములు కొట్టేసేందుకు టీడీపీ మంత్రివర్యులు నారా లోకేష్ ప్రయత్నించారని వివరించారు. ఇలాంటివి ఇంకా ఏమైనా ఉంటే పరిశీలన చేస్తామని వెల్లడించారు.
ఫేక్ కంపెనీ అయితే ఫైనాన్షియల్ స్టేట్ మెంట్లు ఎందుకు విడుదల చేస్తుందన్న మాజీ మంత్రి నారా లోకేష్
ఇక ఈ వ్యాఖ్యలపై మండిపడిన మాజీ మంత్రి నారా లోకేష్ నిజంగా ఇది ఫేక్ కంపెనీ అయితే ఫైనాన్షియల్ స్టేట్ మెంట్లు ఎందుకు విడుదల చేస్తుందని ప్రశ్నించారు. కనీసం ఈ మాత్రం తెలీదా అని ఎద్దేవా చేశారు. ఇది కూడా తెలియని వ్యక్తులు అక్రమాలపై విచారణ చేస్తామని చెబుతున్నారని లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు .యథా సీఎం... తథా మంత్రి అన్నట్టు నోటికొచ్చిన అబద్ధాలతో ఎవరికివారు టీడీపీపై బురదచల్లేవారే కానీ ఈ ఆరోపణలపై కనీస అవగాహన కూడా ఉండటంలేదు వైసీపీ వాళ్ళకు అని లోకేష్ విమర్శలు గుప్పించారు . రిలయన్స్ కంపెనీ పేరుతో ఒక ఫేక్ కంపెనీని సృష్టించి 1000 ఎకరాలు కొట్టేసేందుకు టీడీపీ కుట్ర చేసిందని మంత్రి గౌతమ్ రెడ్డి ఆరోపించారని నిజంగా ఫేక్ కంపెనీల గురించి తెలుసుకోవాలంటే జగన్ నేర చరిత్రను ఓసారి చదువుకోవాలని లోకేశ్ గౌతమ్ రెడ్డికి సూచించారు.
ఆరోపణలు చేసే ముందు ఒకటి, రెండు నిముషాలు బుర్ర పెట్టండి అన్న లోకేష్
ఇక ఇదే విషయంపై వరుస ట్వీట్లు చేసిన లోకేష్ "బాధ్యతారహితంగా ఆరోపణ చేసేముందు కనీసం ఒక రెండు నిముషాలు బుర్ర పెడితే సమాచారం అంతా ఇంటర్నెట్లోనే దొరికేది. రిలయన్స్ ప్రోలిఫిక్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చెందిన సంస్థ. సంస్థ ఫైనాన్సియల్ స్టేట్ మెంట్లు కూడా విడుదల చేసింది చూడండి". ఇది కూడా అర్ధం కాలేదా అని మండిపడ్డారు. అంతేకాకుండా "మంత్రిగారు ఈ సంస్థనే ఫేక్ కంపెనీ అంటున్నారు. ఫేక్ కంపెనీ ఎక్కడైనా ఫైనాన్సియల్ స్టేట్ మెంట్ లు రిలీజ్ చేస్తుందా? ఇది కూడా తెలీని వారు అక్రమాలపై లోతుగా విచారణ చేస్తారంట. మంత్రిగారూ! ఫేక్ కంపెనీల గురించి తెలుసుకోవాలంటే మీ అధినేత నేర చరిత్రను ఒకసారి చదువుకోండి" అంటూ లోకేష్ చురకలు అంటించారు.