లాక్డౌన్ దుష్ప్రభావం: గ్రామాల మధ్య కంచె: రాళ్లు విసురుకున్న గ్రామస్తులు.. విషమం..!
నెల్లూరు: భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ క్రమంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. దాడులు ప్రతిదాడులకు కారణమౌతున్నట్లు కనిపిస్తోంది. కరోనా వైరస్ ఊళ్ల మధ్య చిచ్చు రేపుతోంది. లాక్డౌన్ను కఠినంగా అమలు చేయడంలో భాగంగా తమ గ్రామాల మీదుగా బయటి వ్యక్తులెవరూ రాకపోకలను సాగించడానికి వీల్లేకుండా వేసుకున్న కంచెలు.. ఇప్పుడు తాజాగా వివాదాలకు కేంద్రబిందువుగా మారాయి.
నెల్లూరు జిల్లాలో రెండు గ్రామాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగడానికి, పరస్పరం రాళ్లు విసుకోవడానికి ఈ కంచెలే కారణాలు అయ్యాయి. ఈ తరహా ఉదంతాలు జిల్లాలోని లక్ష్మీపురం, కొత్తూరు, విడవలూరు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. తమ గ్రామాల మీదుగా పొరుగు గ్రామాలవారు రాకపోకలు సాగించడాన్ని నిరసిస్తూ లక్ష్మీపురం, కొత్తూరు, విడవలూరు గ్రామస్తులు కంచెలు ఏర్పాటు చేసుకున్నారు.
Video: గ్రామాల మధ్య కంచె: రాళ్లు విసురుకున్న గ్రామస్తులు.. విషమం..!#Nellore pic.twitter.com/aL2MtFflDE
— oneindiatelugu (@oneindiatelugu) April 5, 2020
లాక్డౌన్ ప్రకటించిన తొలి రోజు నుంచే ఆయా గ్రామాల ప్రజలు ఐక్యంగా మార్గాలను మూసివేశారు. ఎవరూ తమ గ్రామం మీదుగా రాకపోకలు సాగించడానికి వీల్లేదంటూ వాటిని మూసివేశారు. ఆయా గ్రామాల మీదుగా రాకపోకలు సాగించే కొందరు దీన్ని వ్యతిరేకించారు. కొద్ది రోజులుగా ఆదే అంశంపై మూడు గ్రామాల మధ్య పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చాయి. తాజాగా అవి బద్దలు అయ్యాయి. ఆయా గ్రామాల ప్రజలు ఘర్షణకు దిగాల్సి వచ్చింది. పరస్పరం రాళ్లు విసుకున్నారు.
ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ఒక గ్రామం ప్రజలు మరో గ్రామానికి వస్తే వైరస్ తమ గ్రామాని సోకుతుందేమో అన్న ఉద్దేశంతో ఎవరికి వాళ్లు కంచెలు వేసుకున్నారు. కరోనా భయంతో అందరూ గుంపులుగా వెళ్లి దాడులు చేసుకున్నారు. బయటి వ్యక్తులు తమ గ్రామాలు, వీధుల మీదుగా రాకపోకలు సాగించడం వల్ల వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు కావడం కూడా వారి ఆందోళనకు కారణమైంది.