ఉగ్ర కదలికలు: నెల్లూరు తీరంలో శ్రీలంక బోటు .... షార్,కృష్ణపట్నం పోర్టులకు హై అలర్ట్
శ్రీలంకలో నెలరోజుల క్రితం జరిగిన ఆత్మాహుతి దాడులు మరువక ముందే ఏపీలోని నెల్లూరు తీరప్రాంతానికి శ్రీలంక బోటు కొట్టుకువచ్చిన ఘటన కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పొన్నపూడి పాతూరు గ్రామంలోని సముద్రంలో ఈ పడవ మే18న కొట్టుకువచ్చింది.శ్రీలంక నుంచి ఈ బోటు కొట్టుకు రావడం పలు అనుమానాలు తావిస్తోంది. ఇందులో ఉగ్రవాదులు ఏమైనా వచ్చారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. శ్రీలంక నుంచి నెల్లూరు వరకు రావాలంటే తమిళనాడు దాటుకుని రావాలని అలాంటప్పుడు తమిళనాడు తీరప్రాంతంలో భద్రతా సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నెల్లూరు తీరంలో ఈ బోటును మత్స్యకారులు గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఖాళీగా ఉన్న బోటును వారే ఒడ్డుకు చేర్చారు. బోటుపై రాసి ఉన్న అక్షరాల ఆధారంగా ఇది శ్రీలంకకు చెందిన బోటు అని తేల్చేశారు అధికారులు. అంతేకాదు బోటుపై భారత్-శ్రీలంక ఫ్రెండ్షిప్ స్టికర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇందులో ఉగ్రవాదులు వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు తీరప్రాంతం, అటవీ ప్రాంతంలో ఆక్టోపస్ దళాలు జల్లెడ పడుతున్నాయి. ఇక మెరైన్ పోలీసులు కూడా గస్తీని ముమ్మరం చేశారు. ఇప్పటికే షార్, కృష్ణపట్నం పోర్టు ఇతర తీరప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు.
శ్రీలంక నుంచి కొట్టుకువచ్చిన బోటులో కాల్చిపడేసిన సిగరెట్లు, బీడీపీకలతో పాటే ఓ నీళ్ల క్యాన్ ఉందని దానిపై శ్రీలంక స్టికర్ అంటించి ఉందని పోలీసులు తెలిపారు. ఇక ఇతర కూడా ఉందని చెప్పిన మెరైన్ పోలీసులు ఆ సామగ్రిని చూస్తే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. తమిళనాడులో తీరప్రాంత పోలీసులు కంటకనపడకుండా ఈ బోటు ఇంత దూరం ఎలా వచ్చిందనేదానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు ఈ బోటు సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సామర్థ్యం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. ఇది లైఫ్ బోటు అయి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి శ్రీలంక నుంచి సముద్రంలో కొట్టుకువచ్చిన బోటు పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.