నిమ్మగడ్డతో ఢీ.. అమ్మ ఒడికి రెడీ: నెల్లూరుకు వైఎస్ జగన్: షెడ్యూల్ ఇదే
నెల్లూరు: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించడానికి షెడ్యూల్ విడుదలైన వేళ.. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో..జగన్ సర్కార్ సన్నాహాలు పూర్తి చేస్తోంది. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎలాంటి కొత్త పథకాలను గానీ, ఇప్పటికే ప్రవేశపెట్టిన పథకాలను గానీ అమలు చేయకూడదంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినప్పటికీ.. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే రెండో విడత అమ్మ ఒడి పథకం ప్రారంభం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రెండో విడత అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నెల్లూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం 9.45 నిమిషాలకు ఆయన తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో నెల్లూరుకు బయలుదేరి వెళ్తారు. 11.10 నిమిషాలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా వేణుగోపాల స్వామి కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11.40 నిమిషాలకు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శిస్తారు. అనంతరం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుని అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం ఒకటిన్నరకు తాడేపల్లికి బయలుదేరుతారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అమ్మఒడి పథకం అమలవుతుందా? లేదా? అనే అనుమానాలకు ప్రభుత్వం ఇదివరకే తెర దించింది. నోటిఫికేషన్ వెలువడటానికి ముందే తాము ఈ పథకాన్ని ప్రకటించామని చెబుతోంది. లక్షలాది మంది పేద విద్యార్థుల కోసం చేపట్టిన ఈ పథకాన్ని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉద్దేశపూరకంగా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకాన్ని అమలు చేస్తామని, దీనికి అవసరమైన జీవోలను సైతం విడుదల చేసినట్లు విద్యశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటికే స్పష్టం చేశారు.
రెండో విడత అమ్మ ఒడి పథకం కింద 6,612 కోట్ల రూపాయలను ఆర్థికమంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ పథకం కింద 44,08,921 మంది లబ్దిదారులకు 15 వేల రూపాయల నగదు మొత్తాన్ని బదిలీ చేస్తుంది. దీన్ని అడ్డుకోవాలనే ఏకైక ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తన పలుకుబడిని ఉపయోగిస్తున్నారని, ఆయన ఆదేశాలతోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన షెడ్యూల్ను విడుదల చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో అమ్మ ఒడిని వాయిదా వేయించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు.