టీడీపీకి మరో షాక్..! సీఎం జగన్ తో బీఎమ్మార్ మంతనాలు: వైసీపీలో ఎంట్రీ ఖాయమేనా..!
ఏపీ రాజకీయాల్లో జంపింగ్ ల కాలం నడుస్తోంది. టీడీపీకి చెందిన సీనియర్ నేత మరొకరు పార్టీ వీడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తూ..పార్టీకి ఆర్డికంగా అండ దండలు అందించే ఆ నేత ముఖ్యమంత్రి జగన్ తో మంతనాలు జరిపారు. అయితే, ఆక్వా వ్యాపారం పైనే తాను సీఎంతో చర్చించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
అయితే, అదే వ్యక్తికి..వైసీపీలో దాదాపు నెంబర్ టు స్థానంలో ప్రముఖుడు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన సూచనల మేరకే జగన్ ను కలిసారనే వాదన ఉంది. ఎన్నికల సమయంలో ఇదే నేతకు చెందిన సంస్థల మీద ఐటీ దాడులు సైతం జరిగాయి. టీడీపీ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నేతలు మాత్రం ఆయన తమ పార్టీలో చేరుతారంటూ చెప్పుకొస్తున్నారు.
సీఎం జగన్ తో బీఎమ్మార్ మంతనాలు
నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేత.. ప్రముఖ పారిశ్రామికవేత్త బీద మస్తాన్రావు (బీఎమ్మార్) వైసీపీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరంలో ముఖ్యమంత్రి పాల్గొన్న ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో బీద మస్తాన్రావు పాల్గొన్నారు. ఆ వేదికపై ముఖ్యమంత్రితో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు.
దీంతో బీద మస్తాన్రావు వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం మొదలైంది. అయితే, ప్రభుత్వం నుండి వచ్చిన ఆహ్వానం మేరకే మత్స్యకార పారిశ్రామిక వేత్తగా ముఖ్యమంత్రిని కలిసారంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సీఎం తనను మత్స్యకార పాలసీ కమిటీలో సభ్యుడిగా ఉండాలని కోరారని, దానికి తాను అంగీకరించానని బీఎమ్మార్ తన సన్నిహితులతో చెబుతున్నారు.
గత ఎన్నికల్లో పోటీ చేసినా..
టీడీపీలో ఆర్దికంగా బీఎమ్మార్ పార్టీకి అనేక సందర్భాల్లో అండగా నిలిచారని ఆయన మద్దతు దారులే చెబుతూ ఉంటారు. అయితే, తాజాగా జరిగిన ఎన్నికలకు ముందు బీఎమ్మార్ సంస్థల పైన ఐటీ దాడులు జరిగాయి. ఆ తరువాత మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన నెల్లూరు ఎంపీగా టీడీపీ నుండి పోటీ చేయాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇదే జిల్లాకు చెందిన బీద రవిచంద్ర ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.
గత ఎన్నికల్లో ఆయన పార్టీ గెలుపు కోసం సీరియస్ గా పని చేయలేదనే అభిప్రాయం బీఎమ్మార్ అనుచరుల్లో కనిపిస్తోంది. ఇక, రాజధానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సలహా కమిటీలోనూ బీద మస్తాన్ రావు సభ్యుడిగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన సీఎం జగన్ ను కలవటం..రాజకీయంగా జిల్లాలో నెలకొన్న పరిస్థితుల పైన అసహనంతో ఉన్నారనే ప్రచారం తో పార్టీ వైసీపీ వైపు బీఎమ్మార్ చూస్తున్నారనే ప్రచారం పైన ఆసక్తి కనిపిస్తోంది.
సాయిరెడ్డి ద్వారా వైసీపీలోకి..!
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి తో బీఎమ్మార్ స్నేహితులు. వైసీప అధికారంలోకి వచ్చిన తరువాత పలుమార్లు బీఎమ్మార్ ను వైసీపీలోకి రావాలని..సముచిత ప్రాధాన్యత ఉంటుందని చెప్పినట్లుగా సమాచారం. అయితే, జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఎంపీ సీటును గెలుచుకుంది. బీద సోదరుల సొంత నియోజకవర్గం 2014..2019 ఎన్నికల్లో వైసీపీ నుండి ప్రతాప రెడ్డి గెలుపొందారు.
వైసీపీలో చేరినా..రాజకీయంగా లభించే ప్రాధాన్యత మీద అంతర్గతంగా చర్చ సాగుతున్నట్లుగా తెలుస్తోది. జిల్లాలో ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు సాగుతుందనే అభిప్రాయం వారిలో కనిపిస్తోంది. అయితే, ముఖ్యమంత్రి నుండి హామీ వస్తే బీఎమ్మార్ వైసీపీలో చేరే అవకాశాలు కొట్టి పారేయలేమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.