1000 కేసులు.. 14 రాష్ట్రాల పోలీసులకు చుక్కలు.. నెల్లూరులో చిక్కిన ఏటీఎం క్లోనింగ్ క్రిమినల్..!
నెల్లూరు : వెయ్యికి పైగా కేసులున్న ఘరానా దొంగ. 14 రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఏటీఎం కనిపిస్తే చాలు డబ్బులు మాయం చేసే రకం. ఎన్నో ఏళ్లుగా ఏటీఎం సెంటర్లలో యధేచ్ఛగా ఇతరుల డబ్బులు డ్రా చేస్తూ.. ఖాకీలకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఘరానా మోసగాడిని ఎట్టకేలకు నెల్లూరు పోలీసులు పట్టుకోవడం చర్చానీయాంశమైంది.
14 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్గా మారిన ఘరానా దొంగ గుట్టు రట్టైంది. ఏటీఎంలలో చోరీలకు పాల్పడటమే పనిగా పెట్టుకున్న సదరు చోరాగ్రేసరుడు చివరకు పోలీసులకు చిక్కాడు. హర్యానాకు చెందిన సందీప్ ఏటీఎంలలో చొరబడి ఇతరుల ఖాతాల్లోంచి డబ్బులు డ్రా చేయడమే వృత్తిగా మలచుకున్నాడు. ఆ క్రమంలో వేలాది మంది బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి డబ్బులు గుట్టు చప్పుడు గాకుండా ఏటీఎంల నుంచి దొంగిలిస్తున్నాడు.
ఈఎస్ఐ కుంభకోణంలో నిందితులకు రిమాండ్.. ఆ స్కామ్తో సంబంధం లేదన్న నాయిని అల్లుడు..!
దాదాపు 14 రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదైన సందీప్ పోలీసులకు చుక్కలు చూపించాడు. ఎక్కడ కూడా తన జాడ దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు. అయితే నెల్లూరు పోలీసులకు శుక్రవారం నాడు అనూహ్యంగా దొరికిపోయాడు. అతడి నుంచి 7 లక్షల రూపాయల నగదు, కారు, ఎటీఎం కార్డు క్లోనింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దేశమంతటా సందీప్పై వెయ్యికి పైగా కేసులు నమోదయినట్లు నెల్లూరు దర్గామిట్ట పోలీసులు తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 47 కేసులు ఫైల్ అయినట్లు వెల్లడించారు. తన దగ్గరున్న క్లోనింగ్ యంత్రం ద్వారా నకిలీ ఏటీఎం కార్డులు తయారు చేస్తూ డబ్బులు డ్రా చేస్తున్నట్లు గుర్తించారు. 14 రాష్ట్రాల పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న సందీప్ను చాకచక్యంగా పట్టుకోవడంతో టాస్క్ఫోర్స్ సీఐ శ్రీనివాసన్, ఎస్సైలు బాబీ, సురేశ్ కుమార్ రెడ్డిని జిల్లా ఎస్పీ ఐశ్వర్య అభినందించారు.