రైతుల వ్యతిరేకతను అధిగమించడానికి మోడీకి టీడీపీ మాజీమంత్రి చిట్కాలు: అలా చేస్తేనే విలువ
నెల్లూరు: కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు సహా అనేక చోట్ల రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు రోడ్ల మీదికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలను చేపట్టారు. బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాలు మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, అనుబంధ కార్మిక సంఘాలు బంద్కు మద్దతు ప్రకటించడంతో వాతావరణం వేడెక్కింది. రాస్తారోకోలు, రైల్ రోకోలతో స్తంభించిపోయింది.. భారత్.
సోమిరెడ్డి ఏం చెబుతున్నారంటే..?
ఈ వ్యతిరేకత నుంచి గట్టెక్కడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, వ్యవసాయ శాఖ మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొన్ని సూచనలు, సలహాలను ఇచ్చారు. అలా చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. దేశ ప్రజలు మొత్తం ఏకతాటిపైకి వచ్చి, రైతులకు అండగా నిలిచిన అరుదైన సందర్భంగా ఆయన భారత్ బంద్ను అభివర్ణించారు.
రైతాంగానికి అనుకూలంగా..
నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రెండుసార్లు అధికారంలోకి తీసుకుని వచ్చిన రైతులను చిన్నచూపు చూడటం సరికాదని సోమిరెడ్డి అన్నారు. ఎన్డీఏ కూటమి వరుసగా అధికారాన్ని అందుకోవడంలో రైతాంగమే కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అలాంటి రైతులు రోజుల తరబడి రోడ్ల మీద ఆందోళనలు చేయడం ఏ మాత్రం స్వాగతించదగ్గ పరిణామం కాదని, దేశానికీ మంచిది కాదని అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా.. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పారు.
కనీస మద్దతు ధరను చట్టంబద్ధం చేయాలి..
కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేసేలా కొత్త చట్టాలను తీసుకుని రావాల్సిన అవసరం ఉందని సోమిరెడ్డి అన్నారు. తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధరను కల్పించడం వల్ల రైతుల నుంచి వ్యతిరేకత రాదని చెప్పారు. అలాగే- మార్కెటింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయోత్పత్తులకు కనీస మార్కెటింగ్ కల్పించేలా చేయడం వల్ల రైతులు అభద్రతా భావానికి లోను కాబోరని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు.
సామాన్యుడిపై భారం పడకుండా..
ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయంలో కుదర్చుకునే ఒప్పందాల్లో కనీస మద్దతు ధరను తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ షరతును తీసుకుని రావడం వల్ల ఎవరికి విక్రయించుకున్నా.. తమకు మద్దతు ధర లభిస్తుందనే భావన రైతుల్లో నెలకొంటుందని చెప్పారు. కార్పొరేట్ సంస్థలు వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేసి, నిల్వ ఉంచిన సమయంలో సామాన్యుడిపై ఎలాంటి భారం పడకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సోమిరెడ్డి అన్నారు.
కేంద్రం స్పందించకపోవడం దురదృష్టకరం
ఆయా చర్యలన్నీ ఇప్పుడున్న చట్టాల్లో లేవని ఆయన అంచనా వేశారు. వాటిని రద్దు చేసి, కొత్త వాటిని ప్రవేశపెట్టాలని అన్నారు. అలా చేయడం వల్ల మోడీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పారు. ఆయా చర్యలన్నీ అమలు కావాలంటే.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక మెట్టుకు కిందికి దిగాల్సి ఉంటుందని అన్నారు. కొత్త చట్టాలను తీసుకుస్తే మోడీ విలువ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. వేలాది మంది రైతులు నిరసన దీక్షలను కొనసాగిస్తోంటే.. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.