మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తీవ్ర అసహనంతో చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు: రీజన్ ఇదే
ఏపీలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద సొంత జిల్లా అయిన నెల్లూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, చిత్తూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి గా ఉన్నప్పటికీ తమ జిల్లాకు సాగునీటిని, తాగునీటిని అందించడానికి ఎలాంటి కృషి చేయడం లేదని పెద్ద ఎత్తున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.
సాగునీటి, తాగునీటి సమస్య పరిష్కారం చెయ్యలేదని మంత్రిపై అసహనం
ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైయస్సార్సిపికి పట్టం కట్టిన వివిధ జిల్లాలోని ప్రజలు జగన్ మోహన్ రెడ్డి హయాంలో తమ సాగునీటి ఇబ్బందులు తొలగుతాయని దృఢంగా విశ్వసించారు. కానీ ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ చాలా జిల్లాల్లో సాగునీటి సమస్యను పరిష్కరించలేక పోతున్నారని వైసిపి నేతలు అసహనంతో ఉన్నారు. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా ద్వారా సాగునీరు, తాగునీరు అందించే విషయంపై చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు పనుల్లో జాప్యం గురించి ప్రశ్నించినట్టుగా సమాచారం.
వరదలతో జలాశయాలకు జలకళ.. కానీ నీటి కష్టాలు
హంద్రీనీవా కాలువ పనులు అనంతపురం దాటి కూడా పూర్తి అయ్యింది. చిత్తూరు జిల్లాలో కూడా ఆ కాలువ చాలా వరకూ పూర్తైంది. అయితే నీటి విడుదల అంతంత మాత్రంగానే ఉంది . ప్రస్తుతం కాలువకు ఇస్తున్నటువంటి నీరు చిత్తూరు జిల్లా వాసుల సాగునీటి, తాగునీటి అవసరాలు తీర్చలేక పోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఏపీ లో వరదలు ముంచెత్తడంతో అన్ని జలాశయాలు జలకళతో తొణికిసలాడాయి. ఇక ఈ నేపథ్యంలో రాయలసీమలోని పలు జిల్లాల వాసులు తమ కరువు తీరుతుందని భావించారు.
హంద్రినీవా కాలువ ద్వారా చిత్తూరుకు అందని నీరు
పంటలు బాగా పండుతాయని, సాగునీరు అందుతుంది అని, తాగునీటి సమస్యలు తగ్గుతాయని భావించిన రాయలసీమ ప్రజలు వారు ఊహించని విధంగా పరిస్థితులు లేకపోవడంతో కాస్త అసహనంతో ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లు అనంతపురం జిల్లా వరకూ హంద్రీనీవా కాలువ ద్వారా ప్రవహిస్తున్నాయి. అయితే ఆ తర్వాత నీటి ప్రవాహం మందకొడిగా ఉందని తెలుస్తోంది. దీంతో చిత్తూరు జిల్లా అవసరాలకు తగిన రీతిలో నీటి లభ్యత లేదు.
మంత్రిపై మండిపతున్న చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు
ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు,నేతలుమండిపడుతున్నారని సమాచారం. చిత్తూరు జిల్లా తాగునీరు, సాగునీటి అవసరాలనుతీర్చాలని వారు కోరుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి పాలన మీద ప్రజల అంచనాలు ఎక్కువగా ఉండటంతో, ఆ అంచనాలను అందుకోలేక పోతున్న మంత్రుల తీరుపై ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారని తాజా పరిస్థితుల బట్టి అర్థమవుతుంది.