షార్ ను వణికిస్తున్న కరోనా ... శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో హై అలెర్ట్
నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం షార్ అంతరిక్ష కేంద్రాన్ని కరోనా వణికిస్తోంది. రాకెట్ వేగంతో కరోనా విస్తరిస్తున్న తీరు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సిబ్బందికి ఇబ్బంది కలిగిస్తుంది. అంతరిక్ష కార్యకలాపాలకు అడ్డుపడుతూ కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ఏడాది ముగిసేలోగా మూడు రాకెట్లను ప్రయోగించాలనే ఇస్రో లక్ష్యానికి కరోనా మహమ్మారి పెద్ద అడ్డంకిగా తయారైంది.
కరోనా చివరిది కాదు ...తరువాత మహమ్మారికి సిద్ధంగా ఉండండి : డబ్ల్యూహెచ్ఓ సంచలన హెచ్చరిక
షార్ లో మొత్తం 1950 మంది ఉద్యోగులు, 800 మంది సీఐఎస్ఎఫ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. మే వరకు షార్ లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ జూన్ నుండి షార్ లో కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి. వారం రోజులుగా ఊహించని రీతిలో కేసులు పెరుగుతున్న తీరు శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తుంది. కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో జూలై, ఆగస్టు లలో రెండుసార్లు షార్ లో లాక్ డౌన్ విధించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఇప్పటివరకు వంద మందికి పైగా కరోనా పాజిటివ్ తో బాధపడుతున్నారు. షార్ వద్ద పనిచేసే భద్రతా సిబ్బందికి సైతం కరోనా సోకడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఇక కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. 2020 ప్రయోగాల లక్ష్యంపై కరోనా ఎఫెక్ట్ పడుతున్నట్లుగా అధికారులు అంటున్నారు. ఇప్పటికే షార్ లోని ఎస్బిఐ సిబ్బంది కరోనా బారిన పడటంతో బ్యాంకు మూసివేశారు. సతీష్ ధావన్ మెమోరియల్ ఆసుపత్రిలో వైద్యులు కరోనా వైరస్ బారిన పడడంతో ఆసుపత్రిని మూసివేసి ఇటీవలే పునఃప్రారంభించారు.
షార్ లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం నక్షత్ర గెస్ట్ హౌస్ ను కోవిడ్ ఆసుపత్రి గా మార్చి చికిత్స అందిస్తున్నారు . ఈ ఏడాది పూర్తి చేయాల్సిన మరో మూడు ప్రయోగాలపై యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్న నేపథ్యంలో కరోనా ప్రభావం షార్ పై పడుతుంది. దీంతో మూడు అడుగులు ముందుకు వేస్తే ఏడు అడుగులు వెనక్కు అన్నట్టు పరిస్థితి తయారైంది . ఏది ఏమైనా తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం లోని ఉద్యోగులు, భద్రతా సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు