ఏపీపైనా నివర్ తుపాను ప్రభావం- భయంభయంగా నెల్లూరు- స్కూళ్లకు సెలవులు
తమిళనాడు, పుదుచ్చేరి మధ్య కేంద్రీకృతమైన నివర్ తుపాను ఇవాళ తీరం దాటబోతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. తుపాను ప్రభావం వీటికి సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్పైనా పడుతోంది. కోస్తా తీరంలో ఇప్పటికే అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో తుపాను తీరం దాటే సమయంలో ఏపీపైనా ప్రభావం ఉండొచ్చని సర్కారు అంచనా వేస్తోంది. ఈ మేరకు అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.
Recommended Video
ఏపీపై పడుతున్న నివర్ తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ప్రధానంగా తమిళనాడుకు సమీపంలో ఉన్న నెల్లూరు జిల్లాపై తుపాను ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటికే జిల్లాలో మత్సకారులను వేటకు వెళ్లకుండా ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు నెల్లూరు జిల్లా అధికారులు ప్రకటించారు. తుపాను నేపథ్యంలో ఉద్యోగులకు సెలవులు కూడా రద్దు చేశారు. జిల్లాలో మూడు రోజుల పాటు విద్యాసంస్ధలకు సెలవులు ప్రకటించారు.
మంగళగిరి, వెంకటగిరి నుంచి జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. కావలి, నెల్లూరు, గూడురు, నాయుడుపేట రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్లో 1077 టోల్ఫ్రీ నంబర్ను కూడా అందుబాటులో ఉంచారు. కృష్ణపట్నం పోర్టులో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీర ప్రాంతంలోని 12 మండలాల్లో అత్యవసర రక్షణ పడవలు సిద్ధం చేశారు. మొత్తం తీర ప్రాంతంలో మండలాలలకు ప్రత్యేక అధికారులను నియమించారు. తుపాను ప్రభావం అధికంగా ఉఁటుందని భావిస్తున్న సూళ్లూరు పేటలో నెల్లూరు జాయింట్ కలెక్టర్ ప్రభాకర్రెడ్డి మకాం వేశారు.
నివర్ తుపాను నేపథ్యంలో దగ్గరుండి పరిస్ధితిని సమీక్షించేందుకు జిల్లా మంత్రి అనిల్ యాదవ్ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాకు బయలుదేరి వెళ్లారు. జిల్లా అధికారులతో నిరంతరం టచ్లో ఉంటూ పరిస్ధితిని సమీక్షించాలని సీఎం జగన్ ఆయన్ను ఆదేశించారు. నెల్లూరు రాగానే ఆయన జిల్లాలోని ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాలపై దృష్టిపెట్టాలని ఆయన ఇప్పటికే అధికారులను ఆదేశించారు.