నెల్లూరు ప్రజలు జాగ్రత్త... కల్తీ పాలు అమ్ముతున్నారు..హెచ్చరించిన అధికారులు
నెల్లూరు: అక్రమంగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో కొందరు పక్కదారులు పడుతున్నారు. డబ్బే పరమావధిగా భావించిన ఈ కేటుగాళ్లు అన్నిటినీ కల్తీ చేస్తున్నారు. మనిషి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ కల్తీ ఉదంతం వెలుగు చూసింది. తాగే పాలను కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్లను నెల్లూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు.
నెల్లూరు జిల్లాలో దారుణమైన మోసం వెలుగు చూసింది. దగదర్తి మండలం మనుబోలుపాడు గ్రామ శివారులోని ఓ డెయిరీ ఫాంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. సోదాల సమయంలో అక్కడ పాలు తయారు చేస్తున్న తీరును చూసి షాక్ అయ్యారు. మనుబోలుపాడు గ్రామంకు చెందిన బాబూరావు ఈ డెయిరీని నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ నిఘా అధికారి రాజేశ్వర రెడ్డి తెలిపారు. బాబూరావు అనే వ్యక్తి కల్తీ పాలను విక్రయిస్తున్నట్లు తమకు పక్కా సమాచారం రావడంతో దాడులు నిర్వహించినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. కేవలం 50 లీటర్ల పాలను 150 లీటర్లుగా మార్చేందుకు పలు అడ్డదారులు తొక్కాడని నిఘా అధికారి రాజేశ్వరరెడ్డి వివరించారు.
Recommended Video
ఇక ఈ నకిలీ పాలను తయారు చేసేందుకు యూరియా, పాలపిండి, చక్కెర, నూనె, లాంటి హానికరమైన పదార్థాలు కలిపి విక్రయిస్తున్నట్లు తాము గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పదార్థాలను తాము స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. పూర్తిగా దర్యాప్తు చేసి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఎస్పీ రాజేశ్వరరెడ్డి వివరించారు.
ప్రజలు ఈ నకిలీగాళ్ల నుంచి జాగ్రత్తతో వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు. పాలను సైతం వదలకుండా కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారి గురించి తెలిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, అలాంటి కల్తీగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు వెల్లడించారు.