టీడీపీలో 80శాతం నేతలు అక్రమ మద్యం దందాలో... డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో కొంతమంది పేదలు శానిటైజర్లు తాగి చనిపోవడం బాధాకరమని,అందుకే చీప్ లిక్కర్పై ధరలను తగ్గించామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దశలవారీ మద్య నిషేధానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మద్యం ధరల క్రమబద్దీకరణ అందులో భాగమేనన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పటికే 43 వేల బెల్ట్ షాపులు, 33 శాతం మద్యం షాపులు, బార్లను తగ్గించామని చెప్పారు.
మద్య నిషేధంపై ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తుంటే... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,ఆ పార్టీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దాదాపు 80 శాతం మంది టీడీపీ నేతలు అక్రమ మద్యం దందా చేస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. అప్పట్లో ఎన్టీఆర్ మద్య నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచారని... ఇప్పుడు కూడా అదే మాదిరి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారిందన్నారు. కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఎస్ఈబీ ద్వారా 3 నెలల వ్యవధిలోనే 36వేల కేసులు,46వేల మంది అరెస్ట్ జరిగిందన్నారు.
కాగా,రాష్ట్రంలో తక్కువ రేటు మద్యం బ్రాండ్ల ధరలను ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. రూ.120 క్వార్టర్ బాటిల్పై రూ.30,హాఫ్ బాటిల్పై రూ.60,ఫుల్ బాటిల్పై రూ.120 వరకు తగ్గించింది. అలాగే రూ.120-రూ.150 వరకు ఉన్న బ్రాండ్ల ధరలు కూడా తగ్గించింది. అదే సమయంలో రూ.190-రూ.210 వరకు ఉన్న బ్రాండ్లపై ధరలను పెంచింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ధరలు గురువారం(సెప్టెంబర్ 3) నుంచే అమలులోకి వచ్చాయి.