ఇస్రో దూకుడు: ఒకేసారి 13 యూఎస్ నానో ఉపగ్రహాలు..కార్టోశాట్
నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన దూకుడును కొనసాగిస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టిన మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కౌంట్ డౌన్ మరి కాస్సేపట్లో ముగియబోతోంది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)-సీ 47ను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఈ ఉదయం సరిగ్గా 9:28 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ47 అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. పీఎస్ఎల్వీ సీ-47 ద్వారా కార్టోశాట్ 3తో పాటు మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ 13 కమర్షియల్ నానో శాటిలైట్లు అమెరికాకు చెందినవి.
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. హై రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యం ఉన్న ఉపగ్రహంగా కార్టోశాట్ 3ని రూపొందించారు.
దీంతో ఉగ్రవాద శిబిరాలు, దాక్కున్న శత్రువులకు సంబంధించిన ఫొటోలను స్పష్టంగా తీయటానికి వీలవుతుంది. పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగానికి మంగళవారం ఉదయం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. నిజానికి ఈ ప్రయోగం ఈ నెల 25వ తేదీనే చేపట్టాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు.
ఈ ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థిస్తూ ఛైర్మన్ కే శివన్ మంగళవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్ఎల్వీ -సీ47 కార్టోశాట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆరంభించిన నేపథ్యంలో.. ఆయన తిరుమలేశుడిని దర్శించుకున్నారు. కార్టోశాట్ నమూనా పత్రాలను స్వామివారి పాదల చెంత ఉంచి ప్రత్యేక పూజలను చేశారు.