రేయ్ చంద్రబాబు అని ఎప్పుడైనా అన్నామా?: ఒంట్లో కొవ్వు తగ్గింది గానీ: నారా లోకేష్కు కౌంటర్
కొడాలి నానిని బూతులు మంత్రి, తనను నోటి పారుదల శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తుంటారని, ఇప్పుడు పచ్చి బూతులు మాట్లాడెవరో వారికి క్లారిటీ వచ్చి ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. బూతులు మాట్లాడొద్దంటూ చెప్పేవారే నోరు తెరిస్తే అరేయ్, ఒరేయ్ అంటూ ముఖ్యమంత్రిని తిడుతున్నారని, వాళ్ల వైఖరిని చూస్తే సామెతలు గుర్తుకొస్తోన్నాయని ఎద్దేవా చేశారు. ఏపీకి వచ్చామా.. తిన్నామా.. తెలంగాణకు వెళ్లామా అన్నట్లు ఉండాలే తప్ప పులులు, సింహాలు, నక్కలు, కుక్కలు అంటూ మాట్లాడితే ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు.
సూళ్లూరుపేటలో కాల్వల ఆధునికీకరణ
ఈ ఉదయం ఆయన నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేటలో నీటి ప్రాజెక్టుల కాలువల ఆధునికీకరణ పనులకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. తిరుపతి లోక్సభ సభ్యుడు డాక్టర్ ఎం గురుమూర్తి, స్థానిక ఎమ్మెల్యే కిలివేటీ సంజీవయ్య, ఇతర నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబును ఒరేయ్ అన్నామా?
నారా లోకేష్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తాము రాజకీయపరంగా విమర్శలు చేశామే తప్ప ఆయన వయసుకు గౌరవం ఇచ్చామని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎప్పుడు కూడా చంద్రబాబును ఒరేయ్ అని సంబోధించలేదని గుర్తు చేశారు. తనతో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిని బూతుల మంత్రిగా టీడీపీ నాయకులు ప్రచారం చేస్తోన్నారని, నారా లోకేష్ చేసిన ఏకవచన సంబోధనలు, బూతులను వారు సమర్థిస్తారా? అని నిలదీశారు.
అది గూగుల్ తప్పు..
సంస్కారం లేకుండా మాట్లాడేదెవరో ఇప్పుడు టీడీపీ నాయకులకు క్లారిటీ వచ్చి ఉంటుందని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. నారా లోకేష్ను పప్పు అని తాము అనలేదని, ఈ విషయం గూగుల్ చెప్పిందని పేర్కొన్నారు. గూగుల్లో ఆంధ్రా పప్పు అని టైప్ చేస్తే.. నారా లోకేష్ పేరు వస్తోందని, ఆ విషయాన్ని మాత్రమే తాము చెప్పామని అన్నారు. లుచ్ఛా అంటూ తిట్టడం తమకూ తెలుసునని, అలాంటి భాష తమకూ వచ్చని, సంస్కారం అడ్డొస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
ఒంట్లో కొవ్వు తగ్గింది గానీ..
నారా లోకేష్ గెడ్డం పెంచేసి, సర్జరీ చేసుకుని కొవ్వు తగ్గించుకోవడం వరకు బాగానే ఉందని కితాబిచ్చారు. ఆ కొవ్వు ఒంట్లో మాత్రమే తగ్గినట్టు కనిపిస్తోంది గానీ ఇంకా ఎక్కడా తగ్గినట్లు లేదని ఎద్దేవా చేశారు. ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులను తొక్కి నారా తీశారని చెప్పారు. నారా లోకేష్ తనను తాను సింహంలా చెప్పుకోవడాన్ని అనిల్ కుమార్ యాదవ్ తప్పు పట్టారు. అసలైన సింహం వేట ఎలా ఉందో ప్రజలు చూస్తోన్నారని అన్నారు.
Recommended Video
సీఎం కుర్చీ రాదని తెలిసే..
సింహం (ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి) వేటకు నారా లోకేష్, చంద్రబాబు చిట్టెలుకల్లా హైదరాబాద్లో దాక్కున్నారని అనిల్ కుమార్ యాదవ్ చురకలు అంటించారు. ఏపీలో ఇక తమకు రాజకీయంగా ఎలాంటి భవిష్యత్తు లేదని చంద్రబాబుకు తెలుసు కాబట్టే హైదరాబాద్లో ఇల్లు కట్టి, స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడని అన్నారు. దీనికి కరోనా వైరస్ అని పేరు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కుర్చీ ఇక తమ చేతికి రాదని తెలిసే మకాం మార్చేశారని చెప్పారు. అప్పుడప్పుడూ విజిటర్స్ మాదిరిగా హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చి పోతున్నారని ధ్వజమెత్తారు.