కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం: ఎగిసి పడిన మంటలు: ఉలిక్కిపడ్డ నెల్లూరు జిల్లా
వింజమూరు: నెల్లూరు జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. అగ్నికీలలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా వార్తలు అందినప్పటికీ.. ఎవరూ ధృవీకరించలేదు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు.
జిల్లాలోని వింజమూరు మండలం చంద్రపడియలో గల వినయ్ ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన సంభవించింది. కంప్రెషర్ యూనిట్లో మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న నలుగురు కార్మికులు గాయపడ్డారు. వెంటనే వారిని నెల్లూరులోని నారాయణ ఆసుపత్రికి తరలించారు. అగ్నికీలలు ఇతర యూనిట్లకు కూడా వ్యాపించాయి. ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
ఫ్యాక్టరీ ఉద్యోగులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఆస్తినష్టం భారీగా వాటిల్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మంటలు చెలరేగడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. గాయపడిన కార్మికుల్లో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు.
Recommended Video
విశాఖపట్నంలో తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తూ వచ్చాయి. ఆర్ ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ సహా పరవాడలో గల జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో రెండు కెమికల్ ఫ్యాక్టరీల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. తాజాగా చోటు చేసుకున్న వింజమూరు ఘటనతో నెల్లూరు జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. ఇదివరకు నెల్లూరు నగరంలో ఓ ట్రాన్స్ఫార్మర్ పేలడం వల్ల ఓ రసాయన కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.