నెల్లూరులో కలకలం.. ఆరుగురు రైతు కూలీల అస్వస్థత.. ఒకరి మృతి
నెల్లూరు జిల్లాలో శనివారం(డిసెంబర్ 12) కలకలం రేగింది. జిల్లాలోని కలువాయి మండలం వెలుగొట్టపల్లిలో పొలంలో నాట్లు వేస్తూ ఆరుగురు కూలీలు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వీరిలో ఒకరు మృతి చెందగా మిగతా ఐదుగురిని పొదలకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఒక కూలీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కలుషిత ఆహారమే అస్వస్థతకు కారణమని స్థానికులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏలూరులో అంతుచిక్కని కారణాలతో జనం ఆస్పత్రిపాలవుతున్న తరుణంలోనే నెల్లూరు జిల్లాలోనూ కూలీలు అస్వస్థతకు గురవడం కలకలం రేపుతోంది.
Recommended Video
ఏలూరులో ఆస్పత్రిపాలైన బాధితుల రక్త నమూనాల్లో లెడ్, ఆర్గానో క్లోరిన్, ఆర్గానో ఫాస్పరస్ వంటి రసాయనాలు ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. తాగునీటితో ఎటువంటి సమస్య లేదని గుర్తించిన అధికారులు... స్థానికులు వాడుతున్న బియ్యంలో పాదరసం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. పురుగు మందుల అవశేషాలే ప్రజల అస్వస్తతకు కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీనిపై లోతైన పరిశీలన జరపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఏలూరులో పరిస్థితిపై శుక్రవారం(డిసెంబర్ 11) సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులు, అధికారులతో మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమిటీ వేశామని, ఈ అంశంపై పరీక్షలు చేస్తున్న వివిధ సంస్థలు, ఏజెన్సీలు, నిపుణులను సమన్వయం చేస్తూ కమిటీ ముందుకు వెళ్లాలని సూచించారు. విచ్చలవిడిగా పురుగుమందుల వినియోగానికి అడ్డుకట్ట వేయాలని... నిషేధిత పురుగుమందులు విక్రయించేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.