సాయం చేసే వారిపైనా ఆంక్షలు .. నెల్లూరులో ఇదో రచ్చ !!
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఊహించని విధంగా పెరుగుతున్న కేసులతో లాక్ డౌన్ నిబంధలను కఠినతరం చేశారు. ఇక ఈ నేపధ్యంలో చాలా మంది నిరుపేదలకు , కూలీలకు, వలస కార్మికులకు నిత్యావసరాలు, మరియు ఆహారం అందిస్తున్నారు. అయితే కేసులు పెరుగుతున్న క్రమంలో సహాయం చేసే వారికి సైతం ఆంక్షలు విధిస్తుంది ప్రభుత్వం . ఎవరైనా , ఎవరికి సహాయం చెయ్యాలన్నా తహసీల్దార్ కార్యాలయంలో కానీ , గ్రామ సచివాలయంలో కానీ అందిస్తే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామని చెప్తున్నారు అధికారులు .
అయితే దీనిపై తీవ్ర వ్యతిరేఖత వ్యక్తం అవుతుంది. జిల్లాలో అధికారపార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి మనసుతో పేదలకు కావాల్సిన సరుకులు అందిస్తున్న వారిపై కూడా ఆంక్షలు పెట్టటం దారుణం అని వారు అంటున్నారు . జిల్లాలో నిరుపేదలకు ఆహారం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేయాలంటే అవి గ్రామ సచివాలయాల్లో ఇస్తే ప్రభుత్వం పంపిణీ చేస్తే అధికార పార్టీ అది కూడా తమ ఖాతాలో వేసుకుంటుందని ఇది నీచ రాజకీయాలకు ఉదాహరణ అని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్తున్నారు.
మానవత్వంతో స్పందించి సహాయం చేసే వారిని కూడా ఈ తరహా ఇబ్బందులు పెట్టటం హేయమైన చర్య అంటున్నారు. కావాలనే గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామని చెప్తున్నారని ఆరోపిస్తున్నారు. సొమ్మొకడిది సోకొకడిది అన్న చందంగా ప్రభుత్వ తీరు ఉందని ఆరోపిస్తున్నారు . అయితే అధికార యంత్రాంగం మాత్రం సహాయం పేరుతో సహాయం అందించే వాళ్ళు తిరిగితే వారికి కరోనా వచ్చే ప్రమాదం లేకపోలేదు అని అంటున్నారు. అందుకే ప్రభుత్వ యంత్రాంగం ఈ తరహా నిర్ణయం తీసుకుందని వారు చెప్తున్నారు.