నెల్లూరు రొట్టెల పండుగ రద్దు - గంధం మహోత్సవానికి మాత్రమే ఆంక్షలతో అనుమతి - కరోనా వల్లే
కరోనా మహమ్మారి ప్రభావం ఈ ఏడాది అన్ని పండుగలపై పడింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో గణపతి నవరాత్రులపై కనీవినీ ఎరుగని ఆంక్షలు కొనసాగుతుండగా, ఇప్పుడు ప్రఖ్యాత నెల్లూరు రొట్టెల పండుగ కూడా రద్దయింది. అయితే, పండుగలో ప్రధాన కార్యక్రమమైన 'గంధం మహోత్సవం' మాత్రం కొనసాగుతుందని, కొవిడ్ నిబంధనల ప్రకారం 20కి మించకుండా మత పెద్దలు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని జిల్లా అధికారులు మంగళవారం వెల్లడించారు.
మొహర్రం సందర్భంగా నెల్లూరులోని బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు సాక్షిగా రొట్టెల పండుగ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు పండుగ జరగాల్సి ఉండగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేడుకలను రద్దు చేస్తున్నట్లు నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీ రమణ ప్రకటించారు. రొట్టెల పండుగకు భక్తులరాకను, రొట్టెలు మార్చుకోవడాన్ని నిషేధించామన్న అధికారులు.. దర్గాలో ఐదు రోజుల పాటు 20 మందితో గంధం మహోత్సవానికి అనుమతిచ్చినట్లు తెలిపారు.
ప్రతి ఏటా రొట్టెల పండుగ సందర్భంలో నెల్లూరు జనసంద్రంగా మారుతుంది. ఇక్కడ రొట్టె పడితే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. కులమతాలు, ఆర్థిక వ్యత్యాసాలు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా సాగే రొట్టెల పండుగకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. తొలినాళ్లలో ఒక్కరోజు మాత్రమే నిర్వహించిన పండుగ కాస్తా ఐదు రోజులకు పెరిగింది. 2015లో జగన్ సర్కారు నెల్లూరు రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత ఏర్పాట్లు ఘనంగా చేస్తుండటంతో భక్తుల రాక కూడా పెరిగింది. ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్ కారణంగా రొట్టెల పండుగ రద్దు కావడం భక్తుల్ని నిరాశపర్చింది.
Recommended Video
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించిన లెక్కల ప్రకారం.. నెల్లూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 949 పాజిటివ్ కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 24,275కు, మరణాల సంఖ్య 233కు పెరిగింది. రాష్ట్రం మొత్తం కలిపి కొత్తగా 9,927 కేసులు, 92 మరణాలు నమోదయ్యాయి. ఏపీలో మొత్తంగా 3.71 లక్షల కేసులు నమోదుకాగా, అందులో 2.78లక్షల మంది ఇప్పటికే వ్యాధి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు 90వేలుగా ఉంది. రాష్ట్రంలో కరోనా కాటుకు చనిపోయినవారి సంఖ్య 3,460గా ఉంది.