వైఎస్ భారతికి థ్యాంక్స్ చెప్పిన నెల్లూరు టీడీపీ నేత- 12 ఏళ్లలో తొలిసారి అలా చేసినందుకు...
నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య భగ్గుమంటోంది. తాజాగా ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇదే క్రమంలో ఇవాళ సాక్షిపత్రికలో నెల్లూరు వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డిపై ఓ కథనం వచ్చింది. ధాన్యం కొనుగోళ్లలో దళారుల వ్యవహారశైలిపై వచ్చిన ఈ కథనం వైసీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. ఇన్నాళ్లూ టీడీపీ చేస్తున్న ఆరోపణలకు మద్దతుగా ఈ కథనం ఉండటంతో పచ్చ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇన్నాళ్లూ ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ప్రశ్నిస్తే కాకాణి గోవర్ధన్రెడ్డి ఎదురుదాడి, వ్యక్తిగత దాడి చేస్తున్నారని, ఇప్పుడు తమ పార్టీ పత్రిక సాక్షిలోనే దీనిపై కథనం వచ్చిందని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కాకాణి ఏమంటారని జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు ఆధారాలు అడిగావుగా గోవర్ధన్ రెడ్డీ...ఇదిగో ఈ రోజు మీ సాక్షి పత్రికే బట్టబయలు చేసింది..
గింజ గింజకూ దోపిడీ జరుగుతోందని సాక్షి బయటపెట్టింది..ఇప్పుడేం సమాధానం చెబుతావంటూ ఆయన ప్రశ్నించారు.
అదే సమయంలో పన్నెండేళ్ల సాక్షి పత్రిక చరిత్రలో మొదటిసారి నిజం రాయించిన వైఎస్ భారతమ్మకు అభినందనలు అంటూ వెంకట రమణారెడ్డి ప్రెస్మీట్లో చెప్పారు. దళారుల ముసుగులో రైతులను దోచుకుతిన్న నీ పేరు ఇక కాకాణి గోవర్ధన్రెడ్డి కాదు దళారి గోవర్ధన్రెడ్డి అని రమణారెడ్డి అభివర్ణించారు. రైతులకు అన్యాయం జరుగుతోందని ఇన్నాళ్లూ తాము ఆరోపణలు చేస్తే సోది అన్నారుగా... ఇప్పుడు సాక్షి పేపర్లో వచ్చింది కూడా సోదేనా అని ఆయన్ను రమణారెడ్డి ప్రశ్నించారు.