భర్త డైరెక్షన్.. భార్య యాక్షన్.. రొయ్యల పేరుతో కోట్లకు ముంచిన టీచర్ ఫ్యామిలీ
నెల్లూరు : చేసేది టీచర్ ఉద్యోగం. పది మందికి నాలుగు మంచి మాటలు చెప్పాల్సింది పోయి మోసాల బాట పట్టాడు. కోట్లల్లో అప్పులు చేసి పత్తా లేకుండా పరారయ్యాడు. ఆయన భార్యామణి కూడా తక్కువేమీ తినలేదు. భర్తను వద్దని వారించాల్సింది పోయి ఫుల్లుగా సహకరించింది. ఇరుగు పొరుగుతోనే కాకుండా స్థానికులతో నమ్మకస్తులుగా నటించారు. తీరా కోట్లకు ముంచి ఉడాయించారు.
నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది. టీచర్ ఉద్యోగం వెలగబెడుతూ వ్యాపారం చేయబోతున్నామని.. లాభాలు వచ్చాక మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తామంటూ ఎంతోమందిని నిండా ముంచారు భార్యాభర్తలు. వడ్డీకి ఆశపడ్డ సదరు బాధితులు తీరా అసలు కూడా మునగడంతో లబోదిబమంటున్నారు.
అహా నా పెళ్లంట.. ప్లాస్టిక్ లేదంట.. అతిథులకు ఆనాటి మర్యాదలు గ్రేటంట
భర్తకు తోడుగా భార్య.. ఇద్దరూ కలిసి ముంచారుగా..1
నెల్లూరులోని హరనాథపురం నాలుగో వీధికి చెందిన సీహెచ్ కృష్ణారెడ్డి, పద్మజ భార్యాభర్తలు. తోటపల్లిగూడూరు మండలంలో కృష్ణారెడ్డి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గౌరవప్రదమైన టీచర్ వృత్తిలో ఉండటంతో కృష్ణారెడ్డితో స్థానికులు చనువుగా ఉండేవారు. అదే అలుసుగా తీసుకున్న భార్యాభర్తలు వారిని ముంచే ప్రయత్నానికి తెర లేపారు. అందరితో కలివిడిగా ఉంటూ నమ్మకస్తులుగా మెలిగారు.
ఆ క్రమంలో చాలాసార్లు ఇరుగు పొరుగు వారితో పాటు తెలిసినవారి దగ్గర అవసరాల నిమిత్తం అప్పు తీసుకునేవారు. చెప్పిన సమయానికి తిరిగి అప్పు చెల్లిస్తూ నమ్మకాన్ని కూడబెట్టుకున్నారు. అలా చివరకు పెద్దమొత్తంలో కుచ్చుటోపి కానరాకుండా పరారయ్యారు.
కలివిడిగా ఉంటూ.. ఖతర్నాక్ ప్లాన్..!
స్థానికులతో చనువుగా ఉంటూ వారిలో నమ్మకం కలిగిస్తూ వచ్చారు భార్యాభర్తలు. ఆ క్రమంలో రొయ్యల వ్యాపారం చేయబోతున్నామని.. డబ్బులు అవసరం ఉందంటూ అందినకాడికి అప్పులు తీసుకున్నారు. అలా కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని రాత్రికి రాత్రే పరారయ్యారు. విషయం తెలిసిన బాధితులు సొమ్ము పొగొట్టుకున్నామని లబోదిబమంటున్నారు.
ఆ భార్యాభర్తలు కల్పించిన నమ్మకంతో వారు తిరిగి వస్తారేమోనని బాధితులు ఎదురుచూశారు. ఎంత చూసినా వారి జాడ మాత్రం కనిపించలేదు. దాంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. సోమవారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగికి ఫిర్యాదు చేశారు. బాధితుల కంప్లైంట్ మేరకు స్పందించిన ఎస్పీ.. కేసు నమోదు చేయాలని బాలాజీనగర్ పోలీసులను ఆదేశించారు.
ఇంటిని కూడా అమ్మేశారు.. పత్తాలేకుండా పారిపోయారు
లక్షలో, రెండు లక్షలో కాదు పెద్దమొత్తంలో అప్పులు తీసుకున్నారు భార్యాభర్తలు. పిచ్చిరెడ్డి అనే వ్యక్తి దగ్గర 18 లక్షలు.. సునీత అనే మహిళ దగ్గర 15 లక్షలు.. విజయ్ కుమార్ దగ్గర పదిన్నర లక్షలు.. రజని దగ్గర 9 లక్షలు.. ఇలా ఎవరి దగ్గర తీసుకున్నా పెద్దమొత్తంలోనే అప్పు చేశారు. అదలావుంటే తమ ఇంటిని నెల కిందటే ఓ డాక్టర్కు గుట్టుచప్పుడు కాకుండా విక్రయించారు.
మొత్తానికి కోట్లల్లో దండుకున్నాక అక్కడినుంచి పారిపోయారు. రాత్రికి రాత్రే మాయమైపోయారు. విషయం తెలిసిన బాధితులు వారు వస్తారేమోనని ఆశగా ఎదురుచూసినా లాభం లేకపోయింది. కృష్ణారెడ్డి పనిచేస్తున్న స్కూల్కు వెళ్లి ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఒక్కొక్కరుగా బాధితులు బయటకొస్తున్న తీరు చూస్తుంటే కోట్ల రూపాయల మోసం చేసినట్లు అర్థమవుతోంది.