మధ్యాహ్న భోజనంలో మాయమైన గుడ్డు..!
Recommended Video
నెల్లూరు : పౌష్టికాహారం పేరిట పిల్లలకు ఇస్తున్న కోడిగుడ్డు.. మిడ్ డే మీల్ పథకంలో కనుమరుగవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. నెల్లూరు జిల్లాలో పలుచోట్ల వెలుగుచూసిన ఘటనలు అందుకు ఊతమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు మాయమైందనే వార్తలొస్తున్నాయి. విద్యాశాఖ మెనూ ప్రకారం.. ప్రతి విద్యార్థికి వారంలో ఐదు కోడిగుడ్లు ఇవ్వాలనేది నిబంధన. కానీ వాస్తవానికి వారం రోజులుగా కోడిగుడ్డు లేకుండానే భోజనం పెడుతూ మమ అనిపిస్తున్నారు.
పౌష్టికాహారం.. పేరుకేనా?
గత అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుంచి.. వారంలో 5 రోజులు విద్యార్థులకు కోడిగుడ్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఆ మేరకు ప్రకటన కూడా చేశారు అధికారులు. జిల్లావ్యాప్తంగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్ అన్నీ కలిపి 2 లక్షల 36వేల 274 మంది విద్యార్థులున్నారు. అయితే పోయినేడాది ఆగస్టు నెల వరకు 'మిడ్ డే మీల్' లో ఒక్కో విద్యార్థికి రోజు తప్పించి రోజు కోడిగుడ్డు ఇచ్చేవారు. దాంతో వారంలో ఆ మూడు రోజులు మాత్రం విద్యార్థుల హాజరు శాతం అధికంగా కనిపించేది.
గుడ్డేదీ..! అధికారుల జాడేదీ?
జిల్లా వ్యాప్తంగా వారం రోజుల నుంచి మధ్యాహ్న భోజనం పథకంలో విద్యార్థులకు కోడిగుడ్డు అందడం లేదు. విద్యాశాఖ నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. అసలు గుడ్డు పెడతారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఆయా పాఠశాలలకు కోడిగుడ్లు సరఫరా చేస్తున్న ఏజెన్సీలు కూడా స్పందించడం లేదు. దీంతో అసలేం జరుగుతుందో తెలియక ఉపాధ్యాయులు తికమక పడుతున్నారు. ఏజెన్సీ ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తుంటే అవి పనిచేయడం లేదట. చివరకు విద్యాశాఖకు సమాచారం అందించారు. అయినా ఎలాంటి చర్చలు కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆది నుంచి అంతే..!
మధ్యాహ్న భోజనం పథకం అమలులో కోడిగుడ్డు వ్యవహారం ఆది నుంచి వివాదస్పదంగానే ఉంది. వారానికి 5 రోజులు కోడిగుడ్డు ఇవ్వాలనే నిబంధన ఉన్నా.. ఆగస్టు వరకు మూడు గుడ్లు మాత్రమే ఇచ్చారు. అదే నెల రెండో వారం నుంచి 5 గుడ్లు ఇస్తూ వచ్చారు. అలా ఓ రెండు నెలల పాటు కోడిగుడ్డు పంపిణీ సవ్యంగా జరిగినా.. గతేడాది నవంబరులో మళ్లీ బ్రేక్ పడింది. కొద్ది రోజుల తర్వాత మళ్లీ విద్యార్థులకు కోడిగుడ్లు అందించారు. అయితే వారం రోజుల నుంచి మళ్లీ గుడ్ల పంపిణీకి బ్రేక్ పడటంతో ఈ వ్యవహారం చర్చానీయాంశమైంది. విద్యార్థులకు పౌష్టికాహారం పేరుతో అందించే గుడ్ల విషయంలో ఎందుకిలా జరుగుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.