ఆన్లైన్లో రిజిస్ట్రేషన్.. చంద్రయాన్ 2 ప్రయోగం ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం..
చంద్రయాన్ 2 ప్రయోగాన్ని 22వ తేదీన నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమైంది. ఈ నెల 15న జరగాల్సిన ప్రయోగం రాకెట్లోని క్రయోజనిక్ ఇంజన్లో సాంకేతిక లోపంతో అర్థాంతరంగా ఆగిపోయింది. సైంటిస్టులు ఈ లోపాన్ని సరిదిద్ది రాకెట్ను సిద్ధం చేశారు. ప్రయోగ సన్నాహలలో భాగంగా శుక్రవారం రాకెట్ ప్రయోగ రిహార్సల్స్ నిర్వహించారు. ఆదివారం మిషన్ రెడీనెస్ రివ్యూ, ల్యాబ్ సమావేశాలు జరపనున్నాయి.
ఆదివారం ప్రారంభంకానున్న కౌంట్డౌన్
ఆదివారం సాయంత్రం 6.23గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించనున్నారు. 20 గంటల పాటు కౌంట్డౌన్ కొనసాగనుంది. అనంతరం ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్లతో జీఎస్ఎల్వీ మార్క్ 3ఎం1 ద్వారా జాబిల్లి యాత్రను ప్రారంభించనుంది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దడంతో ఇస్రోకు చెందిన రిటైర్డ్ సైంటిస్టులు కీలక పాత్ర పోషించారు. డాక్టర్ కె. నారాయణ, ఆర్ఈ పెరుమాళ్, బీఎన్ సురేష్, అన్నామలై, జ్ఞానగాంధీ తదితరులు లోపాన్ని సరిదిద్దడంలో తమవంతు సేవలు అందించారు.
ప్రయోగం వీక్షించే అవకాశం
అత్యంత ప్రతిష్ఠాత్మక నిర్వహిస్తున్న ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునేవారికి ఇస్రో అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం 6గంటల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ఈ విషయాన్ని ఇస్రో ట్వీట్ ద్వారా తెలియజేసింది. వీక్షకులు గ్యాలరీ నుంచి ఈ ప్రయోగాన్ని చూడవచ్చని చెప్పింది.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్
చంద్రయాన్ 2 ప్రయోగాన్ని వీక్షించాలనుకునేవారికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని ఇస్రో కల్పించింది. ఇందుకోసం ఇస్రో హెల్ప్ లైన్ నెంబర్ ప్రవేశపెట్టింది. సంస్థ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ లింక్ను పొందుపరిచింది.